prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 5:49 pm Digital Edition : MAHESH MEDCHAL

లింగాపూర్‌లో రెపరెపలాడిన జెండా గొల్లకురుమల హక్కుల కోసం ఐక్య పోరాటానికి పిలుపు

లింగాపూర్‌లో రెపరెపలాడిన జెండా.. గొల్లకురుమల హక్కుల కోసం ఐక్య పోరాటానికి పిలుపు

30 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న గొర్రెలు, మేకల పెంపకదారుల సంఘం

మేడ్చల్‌: గొల్ల, కురుమల హక్కులు, సంక్షేమం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని గొర్రెలు, మేకల పెంపకదారుల సంఘం నాయకులు పిలుపునిచ్చారు. మేడ్చల్‌ మండలంలోని లింగాపూర్‌ గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సంఘం ఏర్పడి మూడు దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం సంఘం సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపింది.

గ్రామ సొసైటీ అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు సానం మల్లేష్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1996 ఆగస్టు 22న ఏర్పడిన సంఘం 2026 ఆగస్టు 22 నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోందని తెలిపారు. ఈ మూడు దశాబ్దాల కాలంలో గొర్రెలు, మేకల పెంపకదారుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో సంఘం కీలక పాత్ర పోషించిందన్నారు.

సంక్షేమానికి మరింత భరోసా కావాలి

గొల్ల, కురుమ కుటుంబాలకు ప్రభుత్వం మరింత సామాజిక, ఆర్థిక భరోసా కల్పించాలని సానం మల్లేష్‌ కోరారు. 50 సంవత్సరాలు దాటిన వారికి ప్రత్యేక ఆర్థిక భద్రత కల్పించాలని, ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. చదువుకున్న గొల్ల, కురుమ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

మహాసభలకు భారీగా తరలిరావాలి

చెంగిచెర్లలో జరగనున్న నాలుగో మహాసభలను విజయవంతం చేసేందుకు మండలం నుంచి పెద్ద సంఖ్యలో సభ్యులు తరలిరావాలని సానం మల్లేష్‌ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు, ప్రతి గ్రామం నుంచి వాహనాలతో మహాసభకు తరలిరావాలని కోరుతూ “ఇంటికో మనిషి.. ఊరుకో బండి” నినాదంతో ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు.

ఐక్యతే బలం

గొల్ల, కురుమల సమస్యలు పరిష్కారం కావాలంటే సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. సంప్రదాయ వృత్తిని ఆధారంగా చేసుకుని జీవిస్తున్న కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు అందేలా కృషి చేయాలని కోరారు.

కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు బత్తుల రవి, జనరల్‌ సెక్రటరీ బత్తుల వీరేష్, కమిటీ సభ్యులు జి. మహేష్, బి. ఆంజనేయులు, బి. లక్ష్మణ్, బి. దేవేందర్, ఎస్. కృష్ణ, బి. నవీన్ తదితరులు పాల్గొన్నారు. లింగాపూర్‌లో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం గొల్ల, కురుమల ఐక్యతను చాటిచెప్పింది.