*మేడ్చల్ రైల్వే స్టేషన్లో మరిన్ని రైళ్లకు హాల్ట్ కల్పించాలి*
*ఎంపీ ఈటల రాజేందర్కు జల్లి శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో వినతిపత్రం*
మేడ్చల్ ఆగస్టు 18 (పీపుల్స్ డైరీ):- మేడ్చల్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని ముఖ్యమైన రైళ్లకు హాల్ట్ కల్పించాలని కోరుతూ మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్కు, రైల్వే అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ మేడ్చల్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. మేడ్చల్ మీదుగా అనేక రైళ్లు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ, ముఖ్యమైన రైళ్లకు హాల్ట్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మేడ్చల్ రైల్వే స్టేషన్లో మరిన్ని రైళ్లకు హాల్ట్లు కల్పించే అంశాన్ని రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.
*వేలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం*
జల్లి శైలజ హరినాథ్ మాట్లాడుతూ మేడ్చల్తో పాటు పరిసర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ వందలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు రైళ్లలో ప్రయాణిస్తున్నారని తెలిపారు. ముఖ్యమైన రైళ్లకు మేడ్చల్లో హాల్ట్ లేకపోవడంతో ప్రయాణికులు సికింద్రాబాద్, కాచిగూడ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు.
మేడ్చల్ స్టేషన్లో మరిన్ని రైళ్లను నిలిపితే వేలాది మంది ప్రయాణికులకు సమయం, రవాణా ఖర్చు ఆదా అవుతుందని పేర్కొన్నారు. పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మేడ్చల్ రైల్వే స్టేషన్కు మరింత ప్రాధాన్యత కల్పించాలని రైల్వే శాఖను కోరారు.
ప్రజల దీర్ఘకాలిక రవాణా అవసరాలను పరిష్కరించేందుకు ఎంపీ ఈటల రాజేందర్ చొరవ తీసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ డివిజన్ ఇన్చార్జి పట్లోళ్ల విక్రమ్ రెడ్డి, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు పాతూరి ప్రభాకర్ రెడ్డి, జగన్ గౌడ్, కోశాధికారి లవంగ శ్రీకాంత్, మాజీ సర్పంచ్ తాళ్లపల్లి మురళీ గుప్త, బీజేవైఎం అధ్యక్షులు రాగం అర్జున్, మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ ప్రధాన కార్యదర్శులు కానుకంటి వంశీ విజయ్ వంజరి, జకట ప్రేమదాసు, ఉపాధ్యక్షులు మైసరి రాజు వంజరి, సర్వేశ్వర రెడ్డి, కార్యదర్శి విష్ణు గౌడ్, సీనియర్ నాయకులు థాత్రిక లక్ష్మణ్ వంజరి, చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ రెడ్డి, రాఘవ రెడ్డి, గోపు నాగరాజు, వంశీ రెడ్డి, పోతుల హరిబాబు రెడ్డి, మామిళ్ల నర్సింగ్, మహేష్ గౌలికర్, పురుషోత్తం, మహీందర్, మహిళా నాయకురాలు అనిత తదితరులు పాల్గొన్నారు.