వైట్ హౌస్లో గ్రాండ్ గా ఫీల్డ్ అసిస్టెంట్ల నూతన జిల్లా కమిటీ ఎన్నిక
పెద్దపల్లి, ఆగస్టు 9 ప్రజావాణి : 
రాష్ట్రంలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు సంపూర్ణ కృషి చేస్తానని టీపీసీసీ నాయకులు, జననేత పెర్క శ్యామ్ స్పష్టం చేశారు. స్థానిక పెద్దపల్లి వైట్ హౌస్లో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు భూమాల చంద్రన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఫీల్డ్ అసిస్టెంట్ల (క్షేత్ర సహాయకుల) నూతన జిల్లా కమిటీ ఎన్నికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఎన్టీయూసీ జిల్లా అబ్జర్వర్, ఉపాధ్యక్షులు అల్వాల ప్రసాద్, మరొక ఉపాధ్యక్షులు మేకల సత్తీష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెర్క శ్యామ్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాల పెంపుతో పాటు ఇతర న్యాయమైన డిమాండ్ల సాధనకు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి కార్యక్రమానికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, హక్కుల సాధన కోసం ఐక్యంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
నూతన కమిటీ ఎన్నిక – ఘన సన్మానం
ఈ సమావేశంలో ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా వేల్పుల మల్లయ్య, గౌరవ అధ్యక్షులుగా భూమాల చంద్రన్న బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులుగా గడ్డం శారద, ఎంజాల సత్తీష్, రాజ్కుమార్, సత్యనారాయణ, సహాయ కార్యదర్శులుగా గంగాధర్, గిరిరాజ్, మామిడిపల్లి సాగర్, ఏదుల రవి, ముఖ్య సలహాదారులుగా రెడ్డినావి, భూపయ్య రాజేష్లతో పాటు పలువురు ఎంపికయ్యారు.
అనంతరం నూతన అధ్యక్షులు వేల్పుల మల్లయ్య, గౌరవ అధ్యక్షులు భూమాల చంద్రన్నలను పెర్క శ్యామ్ శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సంఘానికి విశేష సేవలందించి, నూతనంగా మడగ గ్రామ సర్పంచ్గా ఎన్నికైన మాజీ జిల్లా అధ్యక్షులు అల్వాల ప్రసాద్ సేవలను కొనియాడుతూ ఆయనను కూడా ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.