prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 6:31 pm Digital Edition : MAHESH MEDCHAL

ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్ట పరచాలి కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి

ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్ట పరచాలి – కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి

ఆగస్టు 30న మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా విద్యా సదస్సు

మేడ్చల్: ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టపరచాలని, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఎం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 30న జిల్లా విద్యా సదస్సు నిర్వహించనున్నట్లు సీపీఎం మేడ్చల్ మండల కార్యదర్శి నరేష్ తెలిపారు.

ప్రగతినగర్‌లోని పుచ్చలపల్లి లీలా సుందరయ్య ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10:30 గంటలకు ఈ సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యావేత్తలు, తల్లిదండ్రుల సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీనపరుస్తూ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ వైపు తీసుకెళ్తున్నాయని విమర్శించారు. విద్యా రంగంలో కార్పొరేటీకరణ పెరగడంతో ఫీజుల దోపిడీ విచ్చలవిడిగా సాగుతోందని, దీనివల్ల పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు నాణ్యమైన విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యలో అంతరాలు పెరిగి ఆర్థిక స్థాయిని బట్టి విద్యను పొందే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా ప్రజలందరికీ ఉచితంగా, నాణ్యమైన విద్య అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.

కొఠారి కమిషన్‌ నుంచి నూతన విద్యా విధానం–2020 వరకు విద్యారంగానికి జీడీపీలో కనీసం 6 శాతం కేటాయించాలనే సిఫారసులు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తగిన స్థాయిలో నిధులు కేటాయించడం లేదని అన్నారు. రాష్ట్రాలు కూడా విద్యారంగానికి తగిన బడ్జెట్ కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు.

ఉచిత, నాణ్యమైన విద్య అందించాలి

ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య అందించాలని, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు సమగ్ర ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని సీపీఎం డిమాండ్ చేస్తోందని నరేష్ తెలిపారు. విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను అరికట్టాలని కోరారు.

బడ్జెట్ పాఠశాలల సమస్యలపై చర్చ

మేడ్చల్ మండలంలోని ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మేనేజ్‌మెంట్ అధ్యక్షుడు, కార్యదర్శి, ట్రెజరర్‌లకు ఇప్పటికే సదస్సుకు ఆహ్వానం అందించినట్లు తెలిపారు. జిల్లా విద్యా సదస్సులో బడ్జెట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా చర్చించనున్నట్లు వివరించారు.

ప్రభుత్వ సహకారం, తగిన నిధులు లేక బడ్జెట్ పాఠశాలలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వాటి పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి, అవసరమైన రాయితీలు కల్పించాలని నరేష్ డిమాండ్ చేశారు.

విద్యారంగ సమస్యలపై విస్తృత చర్చకు వేదికగా నిలిచే ఈ జిల్లా విద్యా సదస్సుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.