prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 9:27 pm Digital Edition : RAKESH PEDDAPALLY

ప్రజా, కార్మిక వ్యతిరేక బీజేపీని ఓడించాలి: సీపీఐ రాష్ట్ర నాయకులు కలవేన శంకర్

 

పోత్కపల్లిలో సీపీఐ ప్రజా చైతన్య యాత్ర.. కేంద్రంపై నిప్పులు చెరిగిన నేతలు

ఓదెల/పెద్దపల్లి ఆగస్టు 10 ప్రజావాణి :

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) పోరాటాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగముగానే ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో నిర్వహించిన ‘ప్రజా చైతన్య యాత్ర’ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర

కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడుసార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, మైనార్టీలపై దాడులు తీవ్రమయ్యాయని కలవేన శంకర్ ఆరోపించారు. డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సైతం మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. హామీలను నిలదీస్తే అక్రమ అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలో మతోన్మాదాన్ని అదుపు చేసే శక్తి ఒక్క కమ్యూనిస్టులకే సాధ్యమని, అందుకే ఎర్రజెండా పార్టీలను ఐక్యం చేస్తూ పోరాడుతున్నామని స్పష్టం చేశారు.

ఉపాధి హామీ, అడవి హక్కుల చట్టాలు కమ్యూనిస్టుల ఘనతే

స్వాతంత్య్రం వచ్చాక సెక్యులర్ విధానాలను పాటించిన కాలంలో కమ్యూనిస్టుల మద్దతుతోనే గ్రామీణ ఉపాధి హామీ పథకం, అడవి హక్కుల చట్టాలు వచ్చాయని శంకర్ గుర్తుచేశారు. ఎనిమిది గంటల పని దినాల కోసం పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను నేడు కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ కమిషన్ల కోసమే జరిగిందని, తుమ్మిడిహట్టి వద్ద వైఎస్సార్ చేపట్టిన డిజైన్ తోనే ఉత్తర తెలంగాణకు నిజమైన మేలు జరిగేదని అన్నారు.

సెప్టెంబర్ 1న ఢిల్లీలో భారీ బహిరంగ సభ

కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభను లక్షలాది మందితో విజయవంతం చేయాలని శంకర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సహాయ కార్యదర్శి గోశిక మోహన్, జిల్లా కార్యవర్గ సభ్యులు గౌతమ్ గోవర్ధన్, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి ఎజ్జే రాజయ్య, నేతలు తాళ్లపల్లి మల్లయ్య, కనకరాజు, మార్కాపూర్ సూర్య, రమక్క, ప్రీతం సాయి, మండల కార్యదర్శి కోడం స్వామి, ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి (గవస్కర్) తో పాటు గ్రామ శాఖల కార్యదర్శులు సూత్రాల స్వామి, సమ్మెట నాగేందర్, పల్లె గట్టయ్య, వెంకటరాజు, శంకరయ్య, సదయ్య, హర్ష సాయి తదితరులు పాల్గొన్నారు.