ప్రజావాణిలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ వినతి
టేకుమట్ల, ప్రజావాణి: టేకుమట్ల మండలంలోని చలివాగు పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను తక్షణమే అరికట్టాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎంపీడీవో వసంత్ రామ్, తహసీల్దార్ స్వరూప రాణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ.. మండలంలోని ఏయే గ్రామాల్లో ఇసుక రవాణాకు అధికారికంగా అనుమతులు ఉన్నాయో జిల్లా గనుల శాఖ అధికారులు స్పష్టంగా వెల్లడించాలని కోరారు. అనుమతులు లేకుండానే ఇసుకను తరలించి పట్టణ ప్రాంతాలకు చేరవేస్తూ కొందరు అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. అక్రమ ఇసుక రవాణాపై జిల్లా గనుల శాఖ అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక తరలింపును అధికారులు అడ్డుకోకపోతే ప్రజలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మల్లేష్ హెచ్చరించారు.