గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యమే కారణమా? సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
గోదావరిఖని: ఆగస్టు 2న పోతన కాలనీలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటనలో గృహిణి విజ్ఞత మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. ఈ ఘటనపై స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల భద్రత విషయంలో గ్యాస్ ఏజెన్సీలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సిలిండర్ను వినియోగదారులకు అందించే సమయంలో లీకేజీ ఉందా లేదా, రెగ్యులేటర్, పైపు తదితర పరికరాలు సక్రమంగా ఉన్నాయా అనే విషయాలను పరిశీలించాల్సిన బాధ్యత ఏజెన్సీ సిబ్బందిపై ఉంటుంది. అలాంటి భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం జరిగిందా అనే కోణంలో అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఒక గృహిణి ప్రాణం కోల్పోయిన ఈ ఘటనను సాధారణ ప్రమాదంగా పరిగణించకుండా, గ్యాస్ లీకేజీకి అసలు కారణాలను అధికారులు వెలికితీయాలి. సిలిండర్ సరఫరా, తనిఖీ, నిర్వహణ విషయంలో గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే అంశంపై విచారణ జరిపి, తప్పిదం నిర్ధారణ అయితే సంబంధిత ఏజెన్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అలాగే మృతురాలు విజ్ఞత కుటుంబానికి ప్రభుత్వం, సంబంధిత అధికారులు అండగా నిలిచి తగిన పరిహారం అందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గ్యాస్ ఏజెన్సీల భద్రతా ప్రమాణాలను అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
విజ్ఞత మృతికి న్యాయం చేయాలి
గ్యాస్ లీకేజీ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి.. నిర్లక్ష్యానికి బాధ్యులెవరైనా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందించి ప్రభుత్వం న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.