పార్థివ దేహ అంబులెన్స్ కు ప్రభుత్వం ఆదుకోవాలి
తెలంగాణ రాష్ట్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేద మధ్యతరగతి ప్రజల్లో ఎవరైనా చనిపోయినట్లయితే అట్టి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లాలి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం.
ఇదే అదునుగా భావించి ప్రైవేట్ అంబులెన్సులు అధిక మొత్తంలో డబ్బులు తీసుకుంటున్న క్రమంలో అప్పటి ప్రభుత్వం 2016 నవంబర్లో ఈ పార్థివ వాహనాల సర్వీస్ను అందుబాటులోకి తీసుకువచ్చింది ..అట్టి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతగానో అండగా నిలుస్తున్న పార్థివ వాహనాల సర్వీసులు ఇకపైన నిలిచిపోయే ప్రమాదం ఉన్నట్లు సమాచారం …
గత రెండు సంవత్సరాలుగా పార్థివ వాహనాల నిర్వహణ సంస్థకు ప్రభుత్వం నుండి నిధులు విడుదల కానందున వాహనాల సిబ్బందికి జీతం మరియు డీజిల్ వాహన నిర్వహణ ఖర్చులకు నిధులు విడుదల కాలేదు. దానివల్ల సేవలను కొనసాగించడం చాలా కష్టతరంగా మారింది.
ఈ వాహనాలలో పని చేసే సిబ్బంది సైతం చాలా పేద మధ్యతరగతి కి చెందినవారు వారికి సైతం నెల నెల రావలసిన జీతాలు సరైన సమయంలో ఇవ్వడానికి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తుంది .
ఇట్టి విషయాన్ని నిర్వహణ సంస్థ అధికారులు చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రభుత్వం నుండి నిధులు సమకూర్చడంలో జాప్యం జరిగి చివరికి వాహన సేవలు నిలిచిపోయే స్థాయికి వెళ్లినట్టు సమాచారం ..
ఇదే తరహాలో నిర్వహణ సంస్థ 108, 102 లకు కూడా నిధుల విడుదలలో జాప్యం జరుగుతుందని, వాటి నిర్వహణ కూడా భవిష్యత్తులో కష్టతరంగా మారుతుందని ఉద్యోగస్తులు అధికారులు తెలుపుచున్నారు..
ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఇటువంటి సేవలను గుర్తించి సరైన సమయంలో నిధులు విడుదల చేసి సేవలను కొనసాగించవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు…