prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 9:32 pm Digital Edition : MAHESH MEDCHAL

పాడిపంటలు సమృద్ధిగా పండాలని మొక్కులు

లింగాపూర్‌లో భక్తిశ్రద్ధలతో పోచమ్మ తల్లి బోనాలు

ఎల్లంపేట: ఎల్లంపేట మున్సిపాలిటీ 15వ వార్డు పరిధిలోని లింగాపూర్ గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగను గ్రామ పెద్దల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లిని కొలుస్తూ మహిళలు, భక్తులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.

పాడిపంటలు సమృద్ధిగా పండాలని మొక్కులు

ఈ సందర్భంగా నాతి వేణుగోపాల్ గౌడ్ పోచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేకంగా మొక్కులు చెల్లించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు నిండాలని, రైతులకు అనుకూల పరిస్థితులు ఏర్పడి పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు.

గ్రామ ప్రజల ఐక్యత, సంప్రదాయాల పరిరక్షణకు బోనాల పండుగలు ప్రతీకగా నిలుస్తున్నాయని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. పండుగ సందర్భంగా గ్రామంలో భక్తుల సందడి నెలకొంది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోచమ్మ తల్లి ఆశీస్సులు పొందారు.