prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 1:58 pm Digital Edition : SRIKANTH MULUGU

పసర సెయింట్ మేరీస్ దేశభక్తి చరిత్ర సృష్టించింది

ములుగు జిల్లా
ప్రతినిధి శ్రీకాంత్(ప్రజావాణి)

ఎనిమిది దశాబ్దాల స్వాతంత్ర్యం. కానీ ఆ రోజు పసర గడ్డపై కనిపించిన దృశ్యం మాత్రం యుగాల పాటు గుర్తుండిపోయేలా ఉంది.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర… సెయింట్ మేరీస్ పాఠశాల ఆవరణ ఉదయాన్నే త్రివర్ణ కాంతులతో వెలిగిపోయింది. చిన్నారుల చేతిలో చిన్న జెండాలు, పెద్దల గుండెల్లో పెద్ద దేశభక్తి.
అదే సమయంలో రహదారిపై ఒక చరిత్ర కదులుతోంది. చేతుల్లో మోస్తున్నది కేవలం జెండా కాదు… అది మన త్యాగం, మన గర్వం, మన భారతమాత గౌరవం.
భారత్ మాతా కీ జై” అంటూ మార్మోగిన ఒక్క నినాదం… వందల గొంతులతో కలిసి జాతీయ రహదారినే హోరెత్తించింది. రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డ ప్రజలు కళ్ళు చెమర్చుకున్నారు. కొందరు సెల్యూట్ చేశారు. కొందరు పూలు చల్లారు.
ఇది కేవలం ర్యాలీ కాదు. ఇది ఒక పాఠం. రాబోయే తరానికి దేశం అంటే ఏమిటో చెప్పిన జీవన పాఠం.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్టీఫెన్ రెడ్డి జెండా ఆవిష్కరించిన క్షణం నుండే వాతావరణం మొత్తం దేశభక్తి రంగులో మునిగిపోయింది. విద్యార్థులు “సారే జహా సే అచ్చా” ఆలపిస్తూ అడుగులు వేస్తుంటే… ఆ అడుగుల్లో భవిష్యత్ భారతం కనిపించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పసర ఎస్సై తాజుద్దీన్ విద్యార్థుల క్రమశిక్షణ చూసి అబ్బురపడ్డారు. “ఇంత క్రమశిక్షణ, ఇంత దేశభక్తి… ఇదే మన భారత్ కు నిజమైన బలం” అంటూ ప్రశంసించారు. స్వాతంత్ర్యం ఉచితంగా రాలేదని, దాని విలువను ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలని సూచించారు.
తల్లి తన బిడ్డ చేతిలో జెండా పట్టించి ర్యాలీలో నడిచింది. తండ్రి భుజాలపై ఎక్కించుకుని జెండా చూపించాడు. ఇది ఒక పాఠశాల కార్యక్రమం కాదు… ఇది ఒక కుటుంబం, ఒక గ్రామం, ఒక జిల్లా కలిసి చేసిన జాతీయ యజ్ఞం.
ర్యాలీ ముగిసినా జనం కదల్లేదు. చివరి వరకు నిలబడి దేశభక్తి నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చూశారు. ఫోన్లలో వీడియోలు తీసి “పసర గర్వం” అంటూ సోషల్ మీడియాలో పెట్టారు.
ఈ రోజు పసర సెయింట్ మేరీస్ చేసింది ఏమిటి? 152 మీటర్ల జెండా ఊరేగించడమా? కాదు సార్…
ఒక గ్రామంలోని ప్రతి గుండెలోనూ “నేను భారతీయుడిని” అనే స్పందనను మేల్కొలిపింది.