prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 9:36 pm Digital Edition : RAKESH PEDDAPALLY

పన్నూర్ సమస్యల పరిష్కారానికి సర్పంచ్ వినతి

 

ఆర్జీ-3 జీఎం సుంకరి మధుసూదన్‌కు వినతిపత్రం అందజేసిన సర్పంచ్ చిందం మహేష్

రామగిరి/పెద్దపల్లి ఆగస్టు 25 ప్రజావాణి :

రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ పన్నూర్ సర్పంచ్ చిందం మహేష్ మంగళవారం ఆర్జీ–3 జీఎం కార్యాలయంలో జీఎం సుంకరి మధుసూదన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను ఆయన జీఎం దృష్టికి తీసుకెళ్లారు.

పన్నూర్ సెంటర్‌, శ్రీలంక క్వార్టర్స్ వద్ద ఉన్న సింగరేణి బస్‌షెల్టర్లలో చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా మారాయని సర్పంచ్ తెలిపారు. వర్షాకాలంలో నీరు నిలిచి దోమల బెడద పెరుగుతోందని పేర్కొంటూ, వెంటనే వీటిని శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే వకీల్‌పల్లె, విద్యానగర్ ప్రాంతాల్లోని అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థలో సరైన చాంబర్లు లేక మురుగునీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని వివరించారు. అవసరమైన చోట కొత్త చాంబర్లు ఏర్పాటు చేసి, డ్రైనేజీని పూర్తిస్థాయిలో శుభ్రపరచి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

అంతేకాకుండా, పన్నూర్ సెంటర్ నుంచి ఏఎల్‌పీ మైన్ వరకు, గ్రామంలోని ప్రధాన రహదారులు మరియు కూడళ్లలో రాత్రివేళల్లో సరైన వెలుతురు లేక సింగరేణి కార్మికులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ముఖ్యమైన ప్రాంతాల్లో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామ ప్రజలు, కార్మికుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసి వీలైనంత త్వరగా ఈ సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్ చిందం మహేష్ జీఎంను విజ్ఞప్తి చేశారు.