prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 1:51 pm Digital Edition : PRAJA VANI

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తిరుపతి, ఆగస్టు 15: తిరుపతి జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి పరేడ్‌ను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, అదనపు ఎస్పీలు శ్రీ శ్రీనివాసులు, శ్రీ కె. రవి మనోహర్ చారి, జాయింట్ కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతులు, వ్యవసాయం, విద్య, వైద్యం, పర్యాటకం, పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా పోలీస్ శాఖ అందిస్తున్న సేవలను అభినందించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు నాయకత్వంలో పోలీస్ శాఖ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 2025 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు వరకు మొత్తం 5,324 ఫిర్యాదులు అందగా, 5,044 ఫిర్యాదులను పరిష్కరించారు. మిగిలిన 280 ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించారు.

డ్రోన్ నిఘాతో అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం

నేర నియంత్రణ, ప్రత్యేక తనిఖీలు, నిఘాలో భాగంగా జిల్లాలో డ్రోన్ కెమెరాలను 3,776 సార్లు వినియోగించారు. నాటు సారా తయారీ, గంజాయి వినియోగం, బైక్ రేసింగ్, ప్రమాదకర ఫొటో చిత్రీకరణలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి అక్రమ కార్యకలాపాలను గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ

జిల్లాలో వివిధ సంస్థలు, వ్యాపార సంస్థల వద్ద 87 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. సీసీ కెమెరాల సహాయంతో 562 మంది అనుమానితులను పరిశీలించి, 363 మందిని గుర్తించారు. అదేవిధంగా 102 మంది నేరస్థులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

మహిళలు, విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు

మహిళలు, బాలికలు, విద్యార్థుల భద్రత కోసం శక్తి బృందాల ఆధ్వర్యంలో 6,050 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, ఆన్‌లైన్ ఆటలు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాలపై అవగాహన కల్పించారు.

శక్తి యాప్‌ను 1,18,014 మందితో నమోదు చేయించారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక గస్తీ, అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

ప్రజలకు చేరువగా పోలీసింగ్

ప్రజలకు చేరువగా పోలీసింగ్ నిర్వహించడంలో భాగంగా జిల్లాలో 436 పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార చర్యలు చేపట్టారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, మహిళలు, చిన్నారుల భద్రత, రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

అత్యవసర సేవలతో ప్రాణ రక్షణ

2026లో ఇప్పటివరకు అత్యవసర పోలీస్ సేవలకు 33,952 కాల్స్ అందగా, 9,856 కాల్స్‌పై తక్షణ చర్యలు చేపట్టారు. అందిన సమాచారంతో 507 కేసులు నమోదు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో స్పందించిన కమాండ్ నియంత్రణ సిబ్బంది ఏడుగురు ఆత్మహత్యాయత్నదారులను రక్షించి వారి ప్రాణాలను కాపాడారు.

మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు

“మత్తుకు దూరంగా ఉండండి – భవిష్యత్తును కాపాడుకోండి” అనే నినాదంతో మాదకద్రవ్య రహిత తిరుపతి జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపడుతోంది. ప్రత్యేక పరీక్షల ద్వారా ఇప్పటివరకు 7,810 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా, 415 మంది వినియోగదారులను గుర్తించారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.

సైబర్ నేరాల్లో భారీగా నగదు రికవరీ

2026లో ఇప్పటివరకు 123 సైబర్ నేరాల కేసులు నమోదు చేసి 16 మంది నిందితులను అరెస్టు చేశారు. నేరస్థుల బ్యాంకు ఖాతాల్లోని రూ.5,06,90,806 నగదును నిలిపివేయగా, రూ.2,06,09,330 నగదును రికవరీ చేసి బాధితులకు తిరిగి అందించారు.

అదేవిధంగా మొబైల్ ఫోన్‌ల అన్వేషణ, కేంద్ర పరికర గుర్తింపు వ్యవస్థ వంటి సాంకేతిక మార్గాల ద్వారా సుమారు రూ.3,64,80,000 విలువైన 1,824 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు.

పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం

పోలీస్ సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. వైద్య శిబిరాలు, మహిళా పోలీసులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి నెల మూడో శుక్రవారం పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కార దినం నిర్వహిస్తున్నారు.

విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబరిచిన 25 మంది పోలీస్ సిబ్బంది పిల్లలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతులు అందిస్తున్నారు.

సేవా పతకాలకు ఎంపికైన పోలీస్ సిబ్బందికి అభినందనలు

సేవా పతకాలకు ఎంపికైన అధికారులు, సిబ్బందిని జిల్లా పోలీస్ శాఖ అభినందించింది. అలాగే ఉత్తమ సేవా పతకాలకు ఎంపికైన పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన పోలీస్ సిబ్బందిని గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారిలో మరింత ఉత్సాహం, బాధ్యతాభావం పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

సమిష్టి కృషితో మెరుగైన పోలీసింగ్

జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు నాయకత్వంలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజా సేవలకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ జిల్లా పోలీస్ శాఖ సమిష్టిగా పనిచేస్తోందని అధికారులు తెలిపారు.

ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారం చూపడం, నేరాలను ముందుగానే గుర్తించి అరికట్టడం, మహిళలు, బాలికలు, విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి జిల్లా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులోనూ మరింత అంకితభావం, సమన్వయం, బాధ్యతతో ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.