prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 3:42 pm Digital Edition : PRAJA VANI

తలకు గాయమైతే నిర్లక్ష్యం వద్దు.. ప్రాణం పోవచ్చు!

తలకు దెబ్బ.. ప్రాణం మీదకు తెచ్చింది! 14 ఏళ్ల బాలుడికి అత్యవసర శస్త్రచికిత్స..

మృత్యువు అంచుల నుంచి బాలుడిని కాపాడిన యశోదా వైద్యులు..
కోదాడ, ఆగస్టు 13/ ప్రజావాణి

రోడ్డు ప్రమాదంలో తలకు గాయమైనప్పుడు బయటకు గాయం కనిపించకపోయినా నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పుర్రె లోపల రక్తస్రావం జరిగి మెదడుపై ఒత్తిడి పెరిగితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని తెలిపారు.సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన 14 ఏళ్ల మల్లెబోయిన తేజ దురాజ్‌పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. మూర్ఛ రావడంతో మలక్‌పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించగా.. పరీక్షల్లో పుర్రె లోపల భారీగా రక్తం పేరుకుపోయి మెదడుపై తీవ్ర ఒత్తిడి ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. మెదడు సహజ స్థానంలో నుంచి పక్కకు జరిగినట్లు నిర్ధారించారు. పక్కటెముక విరగడంతో ఊపిరితిత్తి చుట్టూ గాలి చేరినట్లు గుర్తించారు.డా. శ్రీనివాస్ బొట్ల నేతృత్వంలోని వైద్యబృందం అత్యవసరంగా క్రానియోటమీ చేసి మెదడుపై ఒత్తిడి కలిగిస్తున్న రక్తాన్ని తొలగించింది. దెబ్బతిన్న పుర్రె ఎముకను టైటానియం ప్లేట్లు, స్క్రూలతో పునర్నిర్మించారు. ఊపిరితిత్తి సమస్యకు చికిత్సతో పాటు శ్వాసమార్గ నిర్వహణ కోసం ట్రాకియోస్టమీ చేశారు. న్యూరోసర్జరీ, క్రిటికల్ కేర్, కార్డియోథొరాసిక్, పీడియాట్రిక్స్ విభాగాల వైద్యులు సమన్వయంతో చికిత్స అందించి బాలుడి ప్రాణాలను కాపాడారు.

ప్రతి నిమిషం కీలకం

ప్రమాదం తర్వాత స్పృహ కోల్పోవడం, మూర్ఛ, అసాధారణ మగత, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించాలని డా. శ్రీనివాస్ బొట్ల సూచించారు. సకాలంలో పరీక్షలు, అత్యవసర న్యూరోసర్జరీ అందితే శాశ్వత మెదడు నష్టాన్ని నివారించవచ్చని యశోదా మలక్‌పేట్ ఆసుపత్రి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర తెలిపారు.ఈ కార్యక్రమంలో డా. శ్రీనివాస్ బొట్ల (న్యూరోసర్జన్), వాసుకిరణ్ రెడ్డి, వెంకటేశ్వర్లు, ప్రకాష్ పాల్గొన్నారు.