prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 2:29 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

డీఎస్సీ-2025 అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలి బద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ

బద్వేల్(ఆగస్టు10 ప్రజావాణి) డీఎస్సీ-2025 పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలు,అవకతవకలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని,ఇందుకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి,నియోజకవర్గ యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథ్ రెడ్డి,నియోజకవర్గ ఇన్‌చార్జ్ గోవింద రెడ్డి,స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ముందుగా ఎన్జీవో కాలనీలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం డీఎస్సీ అభ్యర్థులు,నిరుద్యోగ యువత,విద్యార్థులు,వైఎస్సార్‌సీపీ నాయకులు,కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు.
పోలీసుల ఆంక్షలు-నేతల ఆగ్రహం:
ర్యాలీ ప్రారంభం నుంచే పోలీసులు భారీగా మోహరించి,అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులను,యువతను పోలీసులు అడ్డుగోలుగా నిలిపివేయడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అణిచివేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా,అడ్డంకులు సృష్టించినా అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు మరియు డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించే వరకు తమ పోరాటం ఆగేది లేదని,రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.