prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 7:21 pm Digital Edition : MAHESH MEDCHAL

గుంతలమయంగా మేడ్చల్ రోడ్లు అధికారుల దృష్టికి సమస్య

గుంతలమయంగా మేడ్చల్ రోడ్లు అధికారుల దృష్టికి సమస్య

మేడ్చల్: మేడ్చల్ 297 డివిజన్ పరిధిలో రోడ్ల దుస్థితి అధ్వానంగా మారింది. చిన్నపాటి వర్షానికే రోడ్లపై గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకుడు రామన్నగారి మణికంఠ గౌడ్ స్పందించి కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.

జోనల్ కమిషనర్‌ను వెంటబెట్టుకుని డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన మణికంఠ గౌడ్.. దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని స్వయంగా చూపించారు. రోడ్లు పూర్తిగా ధ్వంసమై ప్రమాదకరంగా మారాయని, వర్షం వచ్చిన ప్రతిసారీ గుంతల్లో నీరు చేరడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని వివరించారు.

రోడ్లు లేని ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించాలని, ఇప్పటికే ఉన్న రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా మేడ్చల్ పెద్ద చెరువు కట్టపై ఉన్న రహదారితో పాటు నిత్యం రద్దీగా ఉండే చెక్‌పోస్ట్ రోడ్డును కూడా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సమస్యను పరిశీలించిన జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ స్పందిస్తూ.. మేడ్చల్ డివిజన్‌లో రోడ్ల పరిస్థితిని స్వయంగా గమనించామని తెలిపారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రోడ్ల సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుదాంష్ తదితరులు పాల్గొన్నారు.