prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 5:59 pm Digital Edition : MAHESH MEDCHAL

గాజులరామారం యూపీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ

గాజులరామారం యూపీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ

విధుల్లో నిర్లక్ష్యంపై ఆగ్రహం.. వైద్య సేవలు మెరుగుపరచాలని ఆదేశం

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా డీఎంహెచ్‌ఓ డా. కె. ఆనంద్ గాజులరామారం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ (యూపీహెచ్‌సీ)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా విధుల్లో ఉండాల్సిన మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ (ఎల్‌టీ) ముందస్తు అనుమతి లేకుండా విధులకు హాజరుకాకపోవడాన్ని గుర్తించారు. దీనిపై సంబంధిత సిబ్బందిని వివరణ కోరుతూ, విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.

యూపీహెచ్‌సీలోని మందుల నిల్వలను స్టాక్ రిజిస్టర్‌తో సరిపోల్చి పరిశీలించారు. మందుల లభ్యతతో పాటు సమీప గడువు (నియర్ ఎక్స్‌పైరీ) ఉన్న మందులను తనిఖీ చేసి, వాటిని సకాలంలో వినియోగించడం, స్టాక్‌ను సక్రమంగా నిర్వహించడం వంటి అంశాలపై సిబ్బందికి సూచనలు చేశారు.

అదేవిధంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్, యాంటీ స్నేక్ వీనం నిల్వలు, వాటి నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. వ్యాక్సిన్‌లు, ఇతర అత్యవసర మందుల కోల్డ్‌చైన్ నిర్వహణపై కూడా తనిఖీ చేశారు. రికార్డుల్లో నమోదైన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లోని సమాచారంతో క్రాస్ వెరిఫై చేశారు.

యూపీహెచ్‌సీలో వైద్య సేవల పనితీరుపై డీఎంహెచ్‌ఓ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రజలకు అందాల్సిన ప్రాథమిక ఆరోగ్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా తక్షణమే పనితీరును మెరుగుపరచాలని సిబ్బందిని ఆదేశించారు. అవుట్‌పేషెంట్ (ఓపీ) సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు గర్భిణీలకు సంబంధించిన ఏఎన్‌సీ సేవలు, ఎన్‌సీడీ స్క్రీనింగ్, చికిత్సా సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు.

యూపీహెచ్‌సీ పరిధిలోని పాఠశాలలతో సమన్వయం చేసుకుని హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, అర్హులైన విద్యార్థులకు టీకాలు వీలైనంత త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని డా. కె. ఆనంద్ ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.