prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 7:13 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

కుటుంబ కలహాలతో భార్యను ఇటుకతో కొట్టి హత్య…మద్యం మత్తులో ఘాతుకానికి పాల్పడిన భర్త.. ఘట్కేసర్‌లో దారుణం

ఘట్కేసర్, ఆగస్టు 12 (ప్రజా వాణి): కుటుంబ తగాదాలు, భార్యపై అనుమానంతో ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో కట్టుకున్న భార్యపై సిమెంట్ ఇటుకతో దాడి చేసి హత్య చేసిన ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకానగర్‌లో, మినర్వా పాఠశాల సమీపంలో చోటుచేసుకుంది. ఘటనపై మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కిలగనపూర్ మండలం సలకలపూర్ గ్రామానికి చెందిన ఇస్లావత్ మాన్య చెల్లెలు మాధవి (37)ని 18 ఏళ్ల క్రితం కాట్రావత్ రాజు (44)కు ఇచ్చి వివాహం చేశారు. దంపతులు గత 15 ఏళ్లుగా ఘట్కేసర్‌లో నివాసం ఉంటుండగా, వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత మూడేళ్లుగా రాజు మద్యానికి బానిసై భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తరచూ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని, కుటుంబ పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు నిర్వహించి నచ్చజెప్పినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రాజు.. కుటుంబ సభ్యులంతా నిద్రించిన తర్వాత భార్య మాధవిపై పెద్ద సిమెంట్ ఇటుకతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఛాతీపై తీవ్ర గాయం కావడంతో మాధవి స్పృహ కోల్పోయింది. కుటుంబ సభ్యులు, పొరుగువారు వెంటనే ఆమెను 108 అంబులెన్స్‌లో ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. డ్యూటీ వైద్యుడు అర్ధరాత్రి సుమారు 1.30 గంటల సమయంలో ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాట్రావత్ రాజుపై హత్య కేసు నమోదు చేసిన ఘట్కేసర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.