prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 8:57 am Digital Edition : PRAJA VANI

కళాశాలకు వెళ్లి చదువుకోమన్న తండ్రి మందలింపుతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కళాశాలకు వెళ్లి చదువుకోమన్న తండ్రి మందలింపుతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

హైతాబాద్, ఆగస్టు 17, ప్రజావాణి: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ తండాకు చెందిన కేతావత్ అనసూయ (19) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ప్రస్తుతం అనసూయ శంషాబాద్‌లో డిగ్రీ చదువుతోంది.

అనసూయ తండ్రి కేతావత్ కిషన్ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమార్తె ప్రతిరోజూ కళాశాలకు వెళ్లి చదువుకోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రి కిషన్ వినియోగించే టెల్మా-40 షుగర్ మాత్రలను సుమారు 18 మాత్రలు మింగినట్లు సమాచారం. అనంతరం రెండు చేతులను బ్లేడ్‌తో కోసుకుని ఇంట్లో పడిపోయింది.

కొద్దిసేపటి తర్వాత గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం చందన్‌వెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది చికిత్స అందించారు. అయితే అనసూయకు రక్తపోటు తగ్గడంతో పాటు పల్స్ రేటు బలహీనంగా ఉండటం, కడుపులో మంట వంటి సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

ఈ విషయం షాబాద్ ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ ప్రణీత్ దృష్టికి రావడంతో, ఆయన వెంటనే స్పందించి వైద్య సిబ్బందితో మాట్లాడారు. పరిస్థితిని షాబాద్ మండల అభివృద్ధి అధికారి అపర్ణకు కూడా వివరించారు. అనసూయకు మెరుగైన వైద్యం అందించాలని సూచనలు అందడంతో డాక్టర్ ప్రణీత్ ఆసుపత్రికి చేరుకుని ఆమెకు చికిత్స అందించారు.

తరువాత అనసూయ స్పృహలోకి వచ్చినప్పటికీ రక్తపోటు తక్కువగా ఉండటం, పల్స్ బలహీనంగా ఉండటం, కడుపులో మంట ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు డాక్టర్ ప్రణీత్ తెలిపారు.