prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 6:02 am Digital Edition : PRAJA VANI

అమెజాన్ ఆధ్వర్యంలో పాఠశాల, అంగన్వాడీ భవనాల ప్రారంభం

అమెజాన్ ఆధ్వర్యంలో పాఠశాల, అంగన్వాడీ భవనాల ప్రారంభం

పెద్దవేడు, ఆగస్టు 19 (ప్రజావాణి): రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని పెద్దవేడు గ్రామంలో అమెజాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ భవనాలను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, గుడిమల్కాపూర్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ చక్కటి రాజ సులోచన తదితరులు లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు అమెజాన్ సంస్థ ఆధ్వర్యంలో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, పాఠశాల బ్యాగులను ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎలుగంటి మధుసూదన్ రెడ్డి తదితరుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. గ్రామంలో పాఠశాల, అంగన్వాడీ భవనాలను నిర్మించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించిన అమెజాన్ సంస్థ యాజమాన్యానికి గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు అమెజాన్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మండల పరిధిలోని ఇతర గ్రామాల్లోనూ విద్యాభివృద్ధికి సంస్థ సహకారం అందించాలని కోరారు. విద్యారంగంతో పాటు గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కూడా అమెజాన్ సంస్థ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడితే విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చెందేలా అమెజాన్ సంస్థ మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ప్రజలకు ఉపయోగపడేలా పార్కు ఏర్పాటుకు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని షాబాద్ తహసీల్దార్ ఎండి అన్వర్‌ను కోరారు. ఈ పార్కు ఏర్పాటైతే ప్రజలకు పచ్చదనంతో పాటు యువతకు క్రీడలు, వ్యాయామానికి అనువైన స్థలం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

గుడిమల్కాపూర్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామాల్లో పాఠశాల భవనాలను నిర్మించి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అమెజాన్ సంస్థ చేస్తున్న సేవలను అభినందించారు.

కార్యక్రమంలో షాబాద్ మండల విద్యాధికారి లక్ష్మణ్, అమెజాన్ సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మక్తగూడ కాంగ్రెస్ నాయకుల హాజరు

పెద్దవేడు గ్రామంలో అమెజాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాల, అంగన్వాడీ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మక్తగూడ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు బచ్చన్నగారి పెద్దోళ్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గోవుల ఆంజనేయులు, మక్తగూడ మాజీ సర్పంచ్ పత్తి మల్లేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రాల రవీందర్ రెడ్డి, సత్తి బాలరాజ్, ముద్దంగుల నరసింహులు, యాదయ్య, పత్తి శంకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని అమెజాన్ సంస్థను అభినందించారు.

పెద్దవేడు గ్రామంలో విద్యార్థుల కోసం పాఠశాల, అంగన్వాడీ భవనాలను నిర్మించడం అభినందనీయమని, భవిష్యత్తులోనూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అమెజాన్ సంస్థ మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని వారు కోరారు.