prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 9:44 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

అంతర్రాష్ట్ర నేరస్తుల అరెస్ట్‌….పోచారం ఐటీ కారిడార్‌ పోలీసుల చాకచక్యం.. బంగారం, వెండి, ద్విచక్ర వాహనం స్వాధీనం

ఘట్‌కేసర్, ఆగస్టు 11 (ప్రజా వాణి): ఇళ్లకు తాళాలు వేసి ఉన్న సమయంలో వాటిని పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులను పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులు, ఉప్పల్‌ సీసీఎస్‌ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలతో పాటు ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు, రూ.3 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పిర్లిమన్యం గ్రామానికి చెందిన షేక్‌ సహుల్‌ (29) ఆటో డ్రైవర్‌గా, మెద్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌కు చెందిన కుంచాల గురుప్రసాద్‌ (29) కూలీగా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డారు.

ఆగస్టు 2న ఓ వ్యక్తి వ్యక్తిగత పనిమీద గాంధీనగర్‌కు వెళ్లగా, మధ్యాహ్నం సమయంలో అతని భార్య ఇంటికి తాళం వేసి పక్కింటికి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి ఇంటి ప్రధాన ద్వారం, గేటు తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని బీరువాలో భద్రపరిచిన బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు చేపట్టిన పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులు, ఉప్పల్‌ సీసీఎస్‌ పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 73 గ్రాముల బంగారు ఆభరణాలు, 150 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు, రూ.3 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

47 కేసుల్లో ప్రధాన నిందితుడు….. ప్రధాన నిందితుడు షేక్‌ సహుల్‌పై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే 47 క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దోపిడీలు, ఇళ్లలో చోరీలు, వాహనాల దొంగతనాలు, మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసుల్లో అతని ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు. మరో నిందితుడు కుంచాల గురుప్రసాద్‌పై జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఒక ఆస్తి నేరానికి సంబంధించిన కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితులను అరెస్ట్‌ చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులు వెల్లడించారు.