ఘట్కేసర్, జూలై 20: పోచారం 8వ డివిజన్ పరిధిలో పనిచేయని వీధి దీపాలు, స్ట్రీట్ లైట్లు, హైమాస్ట్ లైట్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఘట్కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కె. వినోద్ కుమార్ ఉప్పల్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ శ్రీమతి రాధికను కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా డివిజన్లోని పలు కాలనీలు, ప్రధాన రహదారుల్లో వీధి దీపాలు పనిచేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వివరించారు. రాత్రి వేళల్లో చీకటి నెలకొనడంతో ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడటంతో పాటు ప్రమాదాల అవకాశాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
మరికొద్ది రోజుల్లో బోనాల మహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని వీధి దీపాలు, హైమాస్ట్ లైట్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పనిచేయని లైట్లను తక్షణమే మరమ్మతు చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త లైట్లు ఏర్పాటు చేసి పండుగకు ముందే పూర్తి స్థాయిలో వెలుగులు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
వినతిపై స్పందించిన జోనల్ కమిషనర్ శ్రీమతి రాధిక సమస్యను సానుకూలంగా స్వీకరించి, సంబంధిత అధికారులతో సమీక్షించి వీలైనంత త్వరగా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కె. వినోద్ కుమార్ తెలిపారు.
స్థానిక ప్రజల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.
