prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 9:49 am Digital Edition : BALAKRISHNA BIRKOOR

బీసీ గురుకులంలో సమస్యల వలయం.. విద్యార్థుల ఆందోళన

బీసీ గురుకులంలో సమస్యల వలయం.. విద్యార్థుల ఆందోళన

ప్రజావాణి ప్రతినిధి, బీర్కూర్: బీర్కూరు మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల కొరత విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ విద్యాసంస్థలో 5వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు మొత్తం 580 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సహకారంతో 2023లో ఈ పాఠశాల ప్రారంభమైంది.

విద్యార్థులకు వసతి గృహ సౌకర్యం ఉన్నప్పటికీ, సరిపడా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం ఏడాది క్రితం 19 మరుగుదొడ్లు, స్నానాల గదుల నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు పూర్తి కాలేదని విద్యార్థులు, సిబ్బంది తెలిపారు.

అదేవిధంగా గురుకుల వసతి గృహం చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాఠశాల డ్రైనేజీ నీరు సమీపంలోని పంట పొలాల్లోకి చేరుతుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

ఈ విషయంపై పాఠశాల ప్రిన్సిపాల్ శివకుమార్ మాట్లాడుతూ, పాఠశాలలో ఉన్న సమస్యలను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.