* చెన్నుపల్లె,చింతలపల్లి పంచాయతీల్లో బహిరంగ దోపిడీ!
* వారం వారం ఒక్కో కూలీ నుంచి ₹200 గుంజుతున్న వైనం!
* పైఅధికారుల అండదండలతోనేనా? లేక ఫీల్డ్ అసిస్టెంట్ లీలలా?
* గుసగుసలాడుకుంటున్న ప్రజలు!
వైఎస్ఆర్ కడప జిల్లా:కలసపాడు ప్రజావాణి జూన్ 17) రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద గ్రామీణ కూలీల కష్టార్జితంపై కొందరు అవినీతి తిమింగలాలు కన్నేశాయి.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న [మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కలసపాడు మండలంలో కొందరికి కాసుల వర్షం కురిపించే వ్యాపారంగా మారింది. ఎండనక,వాననక కష్టపడి పని చేసే కూలీల పొట్టగొడుతూ, వారం వారం వారి నుంచి మామూళ్లు వసూలు చేస్తున్న వైనం ఇప్పుడు మండలంలో తీవ్ర కలకలం రేపుతోంది.
వారానికి ₹200 ‘కట్’.లేదంటే మస్టర్ లో ‘ఔట్’!
కలసపాడు మండల పరిధిలోని గ్రామ పంచాయతీ,చెన్నుపల్లె అలాగే చింతలపల్లి గ్రామ పంచాయతీలలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాల్సిన ఫీల్డ్ అసిస్టెంట్లు తమ అధికార పరిధిని దాటి వసూళ్ల దందాకు తెరలేపినట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఉపాధి హామీ పథకం కింద ప్రతి వారం కూలీల ఖాతాల్లో పడే వేతనం నుంచి,ఒక్కో కూలీ కచ్చితంగా ₹200 చొప్పున ఫీల్డ్ అసిస్టెంట్కు ఇచ్చుకోవాల్సి వస్తోందని కూలీలు లబోదిబోమంటున్నారు.ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తే,రాబోయే వారాల్లో వారికి పనులు కల్పించకుండా మస్టర్లలో పేర్లు తీసేస్తామని,లేదా హాజరు తగ్గించి వేతనాలు పడకుండా చేస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇది పై అధికారుల ‘సగమా’? ఫీల్డ్ అసిస్టెంట్ల ‘దోపిడీయా’?
ఈ అక్రమ వసూళ్ల వ్యవహారంపై ఇప్పుడు స్థానిక ప్రజల్లో,కూలీల్లో పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇంత బహిరంగంగా వారంతపు వసూళ్లు జరుగుతున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేమిటని గ్రామీణులు ప్రశ్నిస్తున్నారు.* ఈ వసూలు చేస్తున్న సొమ్ములో స్థానిక ఉన్నతాధికారులకు ఏమైనా “సగం (వాటా)” వెళ్తుందా?
* అధికారుల అండ చూసుకునే ఫీల్డ్ అసిస్టెంట్లు ఇంతలా రెచ్చిపోతున్నారా?
* లేక అధికారులకు తెలియకుండా క్షేత్రస్థాయి సిబ్బందే ఈ దోపిడీకి పాల్పడుతున్నారా? అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కూలీలు ఎంతో కష్టపడితే వచ్చే అరకొర వేతనాల్లో కూడా ఇలా వారానికి ₹200 చొప్పున వందలాది మంది నుంచి వసూలు చేస్తే,నెలకు లక్షలాది రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
పారదర్శకతకు పాతర.. భయపడుతున్న కూలీలు!
ప్రభుత్వం ఉపాధి హామీలో అక్రమాలను అరికట్టేందుకు ఎన్నో సాంకేతిక మార్పులు తీసుకువస్తున్నప్పటికీ,క్షేత్రస్థాయిలో మాత్రం పాత పద్ధతుల్లోనే దోపిడీ సాగుతోంది.ఫీల్డ్ అసిస్టెంట్ల భయానికి,ఎక్కడ తమకు ఉపాధి కరువవుతుందోననే ఆందోళనతో కూలీలు నోరు విప్పలేకపోతున్నారు. నోరు తెరిచి ప్రశ్నిస్తే గ్రూపుల నుంచి తొలగిస్తారనే భయం వారిని వెంటాడుతోంది.కలసపాడు మండలంలో నిరుపేద ఉపాధి కూలీల రక్తాన్ని తాగుతున్న ఈ వసూళ్ల రాకెట్పై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఉన్నత స్థాయి విచారణ జరిపి,పల్లె మరియు చింతలపల్లి పంచాయతీలలో జరిగిన వసూళ్లపై క్షేత్రస్థాయిలో కూలీల నుంచి రహస్యంగా స్టేట్మెంట్లు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.అవినీతికి పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల నుంచి తొలగించి,వారి వెనుక ఉన్న పెద్దల పాత్రపై కూడా నిగ్గు తేల్చాలని,నిరుపేద కూలీలకు న్యాయం చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు