ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యత
*వడగాల్పులతో 7జిల్లాల్లో 16 మంది మృత్యువాత
*మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం
*రాష్ట్రంలో తీవ్రస్దాయి ఉష్ణోగ్రతలపై మంత్రి పొంగులేటి సమీక్ష
హైదరాబాద్: ఎండల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. వొచ్చే మూడు రోజుల్లో వడగాల్పుల ప్రభావం మరింత పెరగనుందని ఐఎండీ హెచ్చరికల నేపధ్యంలో జిల్లా కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పుల పరిస్థితుల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శనివారం సచివాలయంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్ పరిస్థితులపై జిల్లాల వారీగా నివేదికలను పరిశీలించి, ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యంతో పనిచేయాలని అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో జిల్లాల కలెక్టర్ల నివేదిక ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నలుగురు, వరంగల్ అర్బన్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున జోగులాంబ గద్వాల్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కరు చొప్పున ఏడు జిల్లాల్లో 16 మంది వడదెబ్బతో మృతి చెందారని అధికారులు మంత్రిగారి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు వడదెబ్బ మృతు కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయిల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని ఇందుకు సంబంధించిన ప్రక్రియను త్వరిత గతిన పూర్తిచేయాలని ఆదేశించారు.