prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 8:28 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఉపాధి హామీలో కొత్త దోపిడీ: టేకుర్‌పేటలో వీడియో కాల్ హాజరుపై తీవ్ర దుమారం

వైఎస్సార్ కడప జిల్లా (ప్రజావాణి జూలై 02) పోరుమామిళ్ల మండలం టేకుర్‌పేట పంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల దోపిడీకి సంబంధించి అటు ప్రజల నుంచి,ఇటు సోషల్ మీడియాలో ఆరోపణలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి.పేద కూలీల కడుపు కొట్టేందుకు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది అడ్డదారులు తొక్కుతున్నారని,టెక్నాలజీని సైతం తమ అవినీతికి అనుకూలంగా మార్చుకుంటున్నారని స్థానికులు మండిపడుతున్నారు.పారదర్శకత ఉండాల్సిన ప్రభుత్వ పథకంలో జరుగుతున్న ఈ బరితెగింపు వ్యవహారంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
పండుగ వేళ.. దొంగ మస్టర్లు
గ్రామాల్లోని పేదలకు పని కల్పించి,వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న ఈ పథకాన్ని కొందరు స్వార్థపరులు కబ్జా చేశారు.ముఖ్యంగా పీర్ల పండుగ వంటి పవిత్రమైన రోజుల్లో. గ్రామంలోని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో పండుగలో పాల్గొంటూ,ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలోనే వారి పేర్లపై ఉపాధి హామీ పనులు జరిగినట్లు రికార్డులు సృష్టించడం విస్మయానికి గురిచేస్తోంది.నిజానికి ఆ రోజు వారు పనికి వెళ్లకపోయినా,వారి పేర్లతో హాజరు వేసి ఐడీలు జారీ చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
వీడియో కాల్ పేరుతో కొత్త మోసం
ఉపాధి హామీ పనుల్లో డిజిటల్ హాజరు,ఫేషియల్ అథెంటికేషన్ వంటి కొత్త పద్ధతులు వచ్చినా. అధికారులు మాత్రం వాటిని కూడా తమ అవినీతికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. కూలీలు ఎవరూ పని ప్రదేశంలో లేకపోయినప్పటికీ.వారిని వీడియో కాల్‌లోకి రప్పించి,ఫోటోలు తీసి వాటి స్క్రీన్‌షాట్‌లను అప్‌లోడ్ చేసి ప్రజెంట్‌గా నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి.టెక్నికల్ అసిస్టెంట్లు,ఫీల్డ్ అసిస్టెంట్లు,కుమ్మక్కై ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు బలంగా అనుమానిస్తున్నారు.
447517, 447513 ఐడీలపై గురి
ఈ అవకతవకల్లో భాగంగా ముఖ్యంగా 447517,447513 ఐడీ నంబర్లపై తీవ్రస్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రికార్డుల్లో చూపిస్తున్న విధంగా నిజంగానే ఆ పనులు జరిగాయా?లేదా? అనే దానిపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఒకరి పేర్లతో మరొకరిని పనికి పంపడం లేదా పనులే జరగకుండా దొంగ మస్టర్లు సృష్టించి ప్రభుత్వ ధనాన్ని పంచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పేదవారికి అందాల్సిన ఉపాధి హామీ సొమ్మును.మధ్యవర్తులు,అవినీతి అధికారులు ఇలా కొల్లగొట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ కుంభకోణంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి,క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. టేకుర్‌పేట పంచాయతీలో రికార్డులు,అప్‌లోడ్ చేసిన ఫొటోలు, హాజరు విధానం తదితర అంశాలపై సమగ్ర విశ్లేషణ జరపాలని కోరుతున్నారు. అవినీతికి పాల్పడినట్లు తేలితే ఎంతటివారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని, ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత,క్రమశిక్షణ ఉండేలా పర్యవేక్షణను కఠినతరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.గ్రామీణాభివృద్ధిని,పేదల సంక్షేమాన్ని నిర్దేశించే ఉపాధి హామీ పథకంలో ఇలాంటి మోసాలు బయటపడుతుండటంతో.కడప జిల్లాలోని సంబంధిత ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది