*విత్తనాల కొనుగోళ్లలో రైతులు అప్రమత్తంగా ఉండాలి – కళ్ళెం సురేందర్ రెడ్డి*
*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*
రానున్న వానకాలం పంటల సాగు సీజన్లను దృష్టిలో ఉంచుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు విషయంలో రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఉద్యమకారులు కళ్ళెం సురేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన రైతులతో కలిసి చండూరులో మాట్లాడుతూ… అధికారిక లైసెన్సు కలిగిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన దానికి బిల్లులు తీసుకోవాలని, తక్కువ ధరలకు విత్తనాలు అందిస్తామని, అధిక దిగుబడి వస్తుందని కొందరు అక్రమార్కులు ప్రచారం చేస్తూ రైతులను మోసం చేసే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంటుందని, అలాంటి వారి నుండి రైతులు మోసపోవద్దని అన్నారు. రైతులు వర్షాలు పడకముందే విత్తనాలు వేస్తే, అవి మొలకెత్తక లేదా మొలకెత్తిన తర్వాత ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందని, భూమి పూర్తిగా చల్లబడిన తర్వాతనే తేమ (తడి) చూసుకొని విత్తనాలు వేయాలని, చాలీచాలని వర్షాలతో విత్తనాలను వేసినట్లయితే విత్తనం సరిగ్గా మొలకెత్తకపోతే మళ్లీ విత్తనాలు వేయాల్సి వస్తుందని, దీనివల్ల అదనపు ఖర్చు అవుతుందని ఆయన అన్నారు. మీ వ్యవసాయ అధికారుల (Agriculture Officer) సలహా మేరకు మీ ప్రాంతంలోని నేల రకానికి అనువైన విత్తనాలను ఎంచుకోవాలని, విత్తనం నాటుకునేందుకు అనువైన పరిస్థితులు తీసుకోవాలి సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు (రైతు) ఎర్రజల లింగయ్య, దొటి శ్రీను, జిల్లా శ్రీను, తదితర రైతులు ఉన్నారు.