prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 2:14 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంక్ సాధన లక్ష్యంగా శానిటేషన్ సెక్రటరీలు మరియు స్వచ్ఛ అంబాసిడర్లకు అవగాహన సమావేశం*

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 24) మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో స్వచ్ఛ సర్వేక్షణ–2026లో మెరుగైన ర్యాంక్ సాధించేందుకు శానిటేషన్ సెక్రటరీలు మరియు స్వచ్ఛ అంబాసిడర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమీషనర్ అలీం బాషా, అదనపు కమీషనర్ శకుంతల స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకింగ్ మెరుగుపరచేందుకు అవసరమైన చర్యలను వివరించారు. గృహస్థాయి వ్యర్థాల నిర్వహణ, మూలంలోనే వ్యర్థాల వేర్పాటు, పరిశుభ్రత చర్యలు మరియు ప్రజల భాగస్వామ్య ప్రాధాన్యతపై శానిటేషన్ సెక్రటరీలు మరియు స్వచ్ఛ అంబాసిడర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ ప్రతి ఇంటిలో హోమ్ కంపోస్టింగ్ విధానాన్ని ప్రోత్సహించడంతో పాటు తడి–పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించే విధానాన్ని ప్రజల్లో మరింత బలోపేతం చేయాలని సూచించారు. అలాగే ప్రతి వార్డులో పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజల చురుకైన భాగస్వామ్యాన్ని పెంపొందించాలని, ప్లాస్టిక్ వినియోగం తగ్గించే దిశగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.అదనపు కమీషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంక్ సాధించడంలో ప్రజల భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. శానిటేషన్ సెక్రటరీలు మరియు స్వచ్ఛ అంబాసిడర్లు తమ పరిధిలోని కాలనీల్లో వ్యర్థాల వేర్పాటు, హోమ్ కంపోస్టింగ్ వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.ఈ సందర్భంగా రీజనల్ డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ  వార్డుల స్థాయిలో శానిటేషన్ కార్యక్రమాల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని తెలిపారు.ప్రజల్లో బాధ్యతాభావం పెంపొందించే దిశగా స్వచ్ఛ అంబాసిడర్లు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. పరిశుభ్రతను ఒక అలవాటుగా మార్చే దిశగా నిరంతర అవగాహన కార్యక్రమాలు అవసరమని తెలిపారు. మంగళగిరి–తాడేపల్లి ప్రాంతాన్ని పరిశుభ్రమైన, ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు మరియు నగరపాలక సంస్థ సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని అధికారులు స్పష్టం చేశారు.