జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్ మే 26 (ప్రజావాణి):
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం శాకాపూర్ గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి ఇత్తినేని లక్ష్మి (70) అనే వృద్ధురాలు మరణించింది. ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…. శాకాపూర్ గ్రామానికి చెందిన ఇత్తినేని లక్ష్మి గత రెండేళ్లుగా స్థానికంగా ఒక అద్దె ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటోంది. అయితే, మంగళవారం రోజున ఆమె ఉంటున్న ఇళ్ల నుంచి తీవ్రమైన దుర్వాసన రావడాన్ని గమనించిన ఇంటి యజమాని రాజు.. వెంటనే ఈ విషయాన్ని ఇటిక్యాల గ్రామంలో ఉంటున్న లక్ష్మి కూతురు బుద్దే అనితకు సమాచారం అందించారు. వెంటనే అనిత అక్కడికి చేరుకుని ఇంటి తలుపులు తెరిచి చూసింది. అప్పటికే ఆమె తల్లి లక్ష్మి స్నానాల గదిలో మరణించి పడి ఉంది. స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో, తల వెనుక భాగంలో తీవ్ర రక్తగాయమై లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు. తన తల్లి స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి, తలకు గాయమై మరణించిందని కుమార్తె బుద్ధె అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్గటూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.