సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభించనున్న సి ఎం రేవంత్ రెడ్డి
– హాజరు కానున్న భట్టి విక్రమార్క,శ్రీధర్ బాబు
షాబాద్// జూలై 9 ప్రజావాణి
షాబాద్ మండలంలోని సీతారాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ ఎనర్జీస్ సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ 30 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగ అభివృద్ధికి ఈ సోలార్ పవర్ ప్లాంట్ దోహదపడనుందని నిర్వాహకులు తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సీతారాంపూర్ గ్రామంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయడంతో పాటు, కార్యక్రమం విజయవంతం అయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, సంస్థ ప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.
