బెజ్జంకి, ఆగస్టు 6 (ప్రజావాణి)
- సైబర్ నేరాల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉంటేనే మోసాల నుంచి రక్షణ పొందవచ్చని సిద్ధిపేట రూరల్ సీఐ సిహెచ్. విద్యాసాగర్ అన్నారు. జాతీయ సైబర్ జాగృతి దివస్ సందర్భంగా రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, సిద్ధిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ‘సురక్ష కా తిరంగా’ సైబర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా రేగులపల్లి గ్రామంలోని సెయింట్ వీన్సెంట్ పల్లొట్టి ఉన్నత పాఠశాలలో బహిరంగ సమావేశం, అవగాహన ర్యాలీ నిర్వహించారు.బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ, నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో సైబర్ నేరస్థులు పంపే అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవవద్దని సూచించారు. ఉద్యోగాల పేరుతో, పెట్టుబడుల పేరుతో వచ్చే మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ తెలియజేయవద్దని హెచ్చరించారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే జాతీయ సైబర్ హెల్ప్లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని, సమీప పోలీస్ స్టేషన్ను కూడా సంప్రదించాలని సూచించారు.బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి మాట్లాడుతూ, సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ ప్యూనా, సిద్ధిపేట రూరల్ ఎస్సై నవత, చిన్నకోడూర్ ఎస్సై చంద్రమోహన్, పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.