prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 3:29 pm Digital Edition : NAZEER CHENNOOR

సెప్టెంబరు 8న ‘ఛలో హైదరాబాద్‌’ను జయప్రదం చేయాలి

సెప్టెంబరు 8న ‘ఛలో హైదరాబాద్‌’ను జయప్రదం చేయాలి

ఎంఎస్ఎఫ్ మంచిర్యాల జిల్లా నాయకుడు చిప్పకుర్తి సతీశ్ మాదిగ

మంచిర్యాల,ఆగస్టు 8,ప్రజావాణి:

ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబరు 8న నిర్వహించనున్న ‘ఛలో హైదరాబాద్‌’ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా నుంచి విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మాదిగ విద్యార్థి సమాఖ్య (MSF) నాయకులు పిలుపునిచ్చారు. శనివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకుడు చిప్పకుర్తి సతీష్‌ మాదిగ మాట్లాడారు.పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందించాలనే లక్ష్యంతో, గుండెజబ్బులతో బాధపడే చిన్నారులకు శస్త్రచికిత్సల కోసం ఎంఆర్‌పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 2004 ఆగస్టు 7న చేపట్టిన పోరాట ఫలితమే ఆరోగ్యశ్రీ పథకమని ఆయన పేర్కొన్నారు. నాడు ఉమ్మడి ఏపీలో ప్రారంభమైన ఈ పథకం, నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజలకు సంజీవనిలా మారిందన్నారు. ఈ ఉద్యమ స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని గుర్తుచేశారు.కులాలు, మతాలకు అతీతంగా మానవత్వమే పరమావధిగా మందకృష్ణ మాదిగ గత మూడు దశాబ్దాలుగా సామాజిక, మానవతా ఉద్యమాలు నడిపారని కొనియాడారు. కులరహిత సమాజ నిర్మాణం, ఆర్థిక సమానత్వం, అన్ని వర్గాలకు రాజకీయ భాగస్వామ్యం కోసం భవిష్యత్తులో ఆయన తీసుకునే నిర్ణయాలకు సమాజమంతా అండగా నిలవాలని కోరారు. ఈ సమావేశంలో ఎంఎస్‌ఎఫ్‌ ప్రతినిధులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.