*సిరిసిల్లలో టీఆర్పీ జిల్లా అధ్యక్షుడిపై పోలీసుల దాడి*
•••భార్యా పిల్లల ముందే రాజకీయ నాయకుడిపై పోలీసుల దాడి
•••సిరిసిల్లలో ప్రజాస్వామ్యానికి లాఠీల మోత.
•••పోలింగ్ పేరుతో దాడి..? నివాసం ముందు నిలబడడం నేరమా..?
•••టీఆర్పీ జిల్లా అధ్యక్షుడిపై ఇద్దరు ఎస్ఐల లాఠీచార్జ్
•••లాఠీ చార్జ్ చేసిన ఇద్దరు ఎస్ఐలపై పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు.
••••సిరిసిల్లకు వస్తా… రోడ్డెక్కుతా..!టీఆర్పీ నేత దాడిపై తీన్మార్ మల్లన్న ఘాటు హెచ్చరిక.
రాజన్న సిరిసిల్ల/ప్రజావాణి

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగిన ఘటన తీవ్ర ఆందోళనకు దారి తీసింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) జిల్లా అధ్యక్షులు బుర్ర మల్లేశం గౌడ్పై పోలీసులు లాఠీలతో దాడి చేశారు.బుధవారం సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో, సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్లో ఉన్న తన నివాసం ఎదుట బుర్ర మల్లేశం గౌడ్ నిలబడి ఉన్న సమయంలో, సమీపంలో పోలింగ్ కేంద్రం ఉండటంతో అక్కడికి వచ్చిన టౌన్ ఎస్ఐ శ్రీకాంత్, ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ లు ఆయనను అక్కడ ఎందుకు ఉన్నావని ప్రశ్నించారు.
తాను అక్కడే నివాసం ఉంటానని చెప్పినప్పటికీ, పోలీసులు ఆయనను లోపలికి వెళ్లాలని హెచ్చరించారు.వెంటనే ఇంట్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిన బుర్ర మల్లేశం గౌడ్ ను ఇష్టం వచ్చినట్లు ఇద్దరు ఎస్సైలు శ్రీకాంత్, ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ లు లాఠీలతో చితకబాదారు.ఈ ఘటన సమయంలో ఆయన భార్య, పిల్లలు అక్కడే ఉండగా, వారి ముందే దాడి జరగడం కలచివేసింది.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెంటనే బుర్ర మల్లేశం గౌడ్తో ఫోన్లో మాట్లాడి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ మాదం రజినీకుమార్, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషాలకు పరామర్శించవలసిందిగా చెప్పగా రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా పార్టీ నాయకులు బుర్ర మల్లేశం గౌడ్ ఇంటికి చేరుకుని ఆయనను పరామర్శించారు.అనంతరం తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా తో కలిసి టీఆర్పీ నాయకులు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి, లాఠీ చార్జ్ చేసిన టౌన్ ఎస్ఐ శ్రీకాంత్, ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్లపై ఫిర్యాదు చేశారు.స్టేషన్లో ఉన్న టౌన్ సీఐ కృష్ణ ఫిర్యాదు స్వీకరించకుండా వెళ్లిపోగా, అక్కడే ఉన్న మహిళా ఎస్ఐ ఫిర్యాదును స్వీకరించారు. ఫిర్యాదు ఇచ్చిన సందర్భంగా ఫోటో తీసేందుకు ప్రయత్నించినప్పటికీ సంబంధిత ఎస్ఐ అంగీకరించలేదని పార్టీ నాయకులు తెలిపారు.బీసీ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేస్తున్న జిల్లా అధ్యక్షుడిపై ఈ విధమైన దాడి తీవ్రంగా ఖండనీయమని అఖిల్ పాషా పేర్కొన్నారు. దాడి చేసిన ఎస్ఐలపై వెంటనే చట్టపర చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.తమ జిల్లా అధ్యక్షుడికి న్యాయం జరగకపోతే తాను స్వయంగా సిరిసిల్లకు వచ్చి ధర్నా నిర్వహిస్తానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగితే ఊరుకునేది లేదని, న్యాయం జరిగే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు ప్రకటించారు.