సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
రామగిరి,జులై 25
రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అర్జీ త్రి జనరల్ మేనేజర్ కార్యాలయంలో జనరల్ మేనేజర్ సుంకరి మధుసూదన్ ని పన్నూర్ గ్రామ సర్పంచ్ చిందం మహేష్ కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని జోన్ వన్, టూ శ్రీలంక క్వార్టర్స్ ప్రాంతంలో సింగరేణి కార్మికులు వారి కుటుంబాలు నివసిస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలోని కార్మికుల పిల్లలు ప్రతిరోజూ పాఠశాలలకు వెళ్లేందుకు బస్సుల కోసం రోడ్డు పక్కన వేచి ఉండాల్సి వస్తోందన్నారు.ప్రస్తుతం బస్ షెల్టర్ సౌకర్యం లేకపోవడంతో చిన్నారులు, వారి వెంట వచ్చే కుటుంబ సభ్యులు,మహిళలు, వృద్ధులు,ఇతర ప్రయాణికులు ఎండ, వర్షాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.కావున ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, జోన్ వన్ ,టూ శ్రీలంక క్వార్టర్స్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం ఆరు బస్ షెల్టర్లను నిర్మించి, సింగరేణి కార్మికుల కుటుంబాలు,విద్యార్థులు, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యం కల్పించవలసిందిగా వినతిపత్రం ద్వారా తెలియజేయడం జరిగింది.
అదేవిధంగా,సెంటినరీ కాలనీలోని అన్ని క్వార్టర్స్లో తాగునీటి పైప్లైన్,డ్రైనేజ్ పైప్లైన్ ఒకే చోట ఉండటం వల్ల సింగరేణి కార్మికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, ఇంతకుముందు కొన్ని క్వార్టర్స్కు ఏర్పాటు చేసిన విధంగానే,మిగిలిన అన్ని క్వార్టర్స్కూ ముందు భాగం నుండి తాగునీటి పైప్లైన్ను ఏర్పాటు చేసి,స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. సింగరేణి కార్మికుల సమస్యను సానుకూలంగా పరిశీలించి, ప్రయోజనార్థం వీలైనంత త్వరగా అవసరమైన చర్యలు చేపట్టాలని అర్జీ త్రి జనరల్ మేనేజర్ సుంకరి మధుసూదన్ ని సర్పంచ్ చిందం మహేష్ కోరారు.ఈ సందర్బంగా కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన జనరల్ మేనేజర్ మధుసూదన్ సమస్యల పరిష్కారానికై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.