prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 9:05 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

సాంఘిక సంక్షేమ హాస్టళ్లను ప్రజాస్వామ్య పర్యవేక్షణకు దూరం చేసే సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలి,బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు సగిలి గురప్ప డిమాండ్.

కడప జులై 28 ప్రజావాణి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ 07-04-2026న జారీ చేసిన హాస్టళ్లలో అనధికార ప్రవేశాల నివారణ సర్క్యులర్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి, భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు, మీడియా స్వేచ్ఛకు విరుద్ధంగా ఉందని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు సగిలి గురప్ప తీవ్రంగా ఖండించారు.హాస్టళ్లలో విద్యార్థుల భద్రత, గోప్యతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. అయితే ఆ పేరుతో మీడియా, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, సామాజిక సంస్థలు జిల్లా అధికారుల ముందస్తు అనుమతి లేకుండా హాస్టళ్లలోకి వెళ్లకూడదని ఆదేశించడం ప్రజాస్వామ్య పర్యవేక్షణను అడ్డుకోవడమే. ఈ విధానం వల్ల హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, కులవివక్ష, అవినీతి, నాసిరకం ఆహారం, మౌలిక వసతుల లోపాలు, అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలు బయటపడకుండా చేసే ప్రమాదం ఉంది.ప్రభుత్వ నిధులతో నడిచే సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ప్రజా సంస్థలు. వాటి పనితీరుపై ప్రజలకు, మీడియాకు, ప్రజాసంఘాలకు ప్రశ్నించే హక్కు ఉంది. ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత బలోపేతం కావాలి గానీ, ఆంక్షల పేరుతో మూసివేయడం సమంజసం కాదు. విద్యార్థులను బెదిరించే లేదా వసూళ్లకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం అవసరమే. కానీ ఆ కారణాన్ని చూపుతూ అన్ని ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, మీడియాపై ఒకే విధమైన ఆంక్షలు విధించడం అన్యాయం.అందువల్ల ఈ సర్క్యులర్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యార్థుల భద్రతను కాపాడుతూనే ప్రజాస్వామ్య హక్కులు, మీడియా స్వేచ్ఛ, సామాజిక పర్యవేక్షణకు భంగం కలగని విధంగా కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు సగిలి గురప్ప డిమాండ్ చేశారు.