prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 3:49 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఆర్థిక సంక్షోభం తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర కన్వీనర్

వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి : తుమ్మల నాగేశ్వరరావు ఏపీ సి ఆర్ పి డబ్ల్యు ఏ  రాష్ట్ర కన్వీనర,

ఆంధ్రప్రదేశ్ ఆగస్టు 02 ప్రజావాణి రాష్ట్రంలోని 28 జిల్లాల్లో విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న సుమారు 23 వేల మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు గత రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థకు వెన్నెముకగా పనిచేస్తున్న ఈ ఉద్యోగులు తమ కుటుంబాల జీవనోపాధి కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొనడం అత్యంత బాధాకరమని  రాష్ట్ర కన్వీనర్ తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వేతనాల కోసం ఎదురుచూస్తున్న వారిలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల బోధన, బోధనేతర సిబ్బంది, క్లస్టర్ రిసోర్స్ మొబైల్ ఉపాధ్యాయులు, నిర్వహణ సమాచార వ్యవస్థ సమన్వయకర్తలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అకౌంట్స్ సిబ్బంది, సైట్ ఇంజినీర్లు, ఫిజియోథెరపిస్టులు, సమ్మిళిత విద్య వనరుల ఉపాధ్యాయులు, మెసెంజర్లు, పార్ట్‌టైమ్ బోధకులు, జిల్లా ప్రాజెక్టు కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.ప్రతి నెల వేతనంపైనే ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇంటి అద్దెలు, బ్యాంకు రుణాల నెలవారీ వాయిదాలు, పిల్లల విద్యా ఫీజులు, వృద్ధుల వైద్య ఖర్చులు, గర్భిణీల చికిత్సలు, నిత్యావసరాల కొనుగోలు వంటి అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. చాలామంది ఉద్యోగులు బంధువులు, స్నేహితుల వద్ద అప్పులు చేయగా, మరికొందరు ఇంటి వస్తువులు తాకట్టు పెట్టి కుటుంబాలను పోషిస్తున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ సమగ్ర శిక్ష ఉద్యోగులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా కార్యక్రమాల నిర్వహణ, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల నిర్వహణ, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సేవలు, శిక్షణా కార్యక్రమాలు, డేటా నిర్వహణ, ప్రభుత్వ ఆదేశాల అమలు వంటి కీలక బాధ్యతలను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తున్నారు.ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం లభించకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని కేవలం పరిపాలనా సమస్యగా కాకుండా 23 వేల కుటుంబాల జీవనాధారానికి సంబంధించిన అత్యవసర మానవతా సమస్యగా గుర్తించి వెంటనే స్పందించాలని కోరారు. ప్రధాన డిమాండ్లు:- పెండింగ్‌లో ఉన్న రెండు నెలల జూన్, జూలై మాసాల వేతనాలను వెంటనే విడుదల చేయాలి. ఇకపై ప్రతి నెలా నిర్దిష్ట తేదీన వేతనాలు చెల్లించే శాశ్వత విధానాన్ని అమలు చేయాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించే చర్యలు చేపట్టాలి.ప్రభుత్వ విద్యను ముందుకు నడిపిస్తున్న వేలాది మంది సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము .