- సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువు కృషి చేయాలి: ఈర్ల రాజు ముదిరాజ్
అమీన్పూర్, జూలై 9 (ప్రజావాణి): పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో శ్రీ దుర్గామాత అమ్మవారి ఆలయ నిర్మాణ శంకుస్థాపన పూజా కార్యక్రమం గురువారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ, సనాతన ధర్మం భారతీయ సంస్కృతికి మూలస్తంభమని, దాని పరిరక్షణకు ప్రతి హిందువు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేవాలయాలు సమాజానికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించడంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
హిందూ సమాజం ఐక్యంగా ఉండి ధర్మ పరిరక్షణకు ముందుకు రావాలని, మన సంస్కృతి, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజా సేవతో పాటు ధార్మిక, సామాజిక కార్యక్రమాల్లోనూ ప్రజలకు అండగా నిలవడం భారతీయ జనతా పార్టీ లక్ష్యమని తెలిపారు.
అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కాలనీ సొసైటీ అధ్యక్షులు మంగలి వెంకటేష్, జనరల్ సెక్రటరీ గులకుంట కృష్ణ ముదిరాజ్, నాయకులు చంద్రకళ, రాజు, మల్లేష్ యాదవ్, తిరుపతి స్వామి మారుతి, కేశవులు తదితరులు పాల్గొన్నారు.