బద్వేల్: జూలై 25 ప్రజావాణి ప్రజలకు గడప దగ్గరే సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి తెచ్చిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను కొందరు ఉద్యోగులు గేలి చేస్తున్నారు. విధులకు గైర్హాజరై ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తూ ప్రభుత్వ జీతాన్ని దండుకుంటున్న దారుణం బద్వేల్లో వెలుగుచూసింది.బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని చింతల్ చెరువు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి ప్రభుత్వ సాయి కిరణ్, డిజిటల్ అసిస్టెంట్ పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.సచివాలయంలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఈ ఉద్యోగి,అదే సమయంలో ప్రైవేట్ కాలేజీలో బోధన చేస్తున్నట్లు వీడియోలు,ఫొటోల సాక్ష్యాలతో స్థానికులు ఆరోపిస్తున్నారు.క్లాస్ రూంలో దొరికిపోయిన సచివాలయ ఉద్యోగి
స్థానికులు అందించిన వీడియో, ఫొటోల్లో సదరు ఉద్యోగి ఆరెంజ్,బ్లూ చెక్స్ షర్ట్తో ఒక ప్రైవేట్ కాలేజీ తరగతి గదిలో నిలబడి విద్యార్థులకు పాఠాలు చెబుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.వెనుక బెంచీలపై కూర్చున్న విద్యార్థులు,బ్లాక్ బోర్డు అన్నీ స్పష్టంగా ఉండడంతో ఈ ఫొటో నకిలీది కాదని స్పష్టమవుతోంది.”ఇతను ఉదయం సచివాలయానికి రావాలి.కానీ కాలేజీకి వెళ్లి కూర్చుంటున్నాడు.మేము సర్టిఫికెట్ల కోసం,పెన్షన్ల కోసం సచివాలయానికి వెళ్తే.ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు”అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా సేవలు గాలికి. ప్రైవేట్ ఆదాయం ముఖ్యంగా!
గ్రామ సచివాలయ ఉద్యోగి అంటే 24/7 ప్రజలకు అందుబాటులో ఉండాలి. రేషన్,పెన్షన్లు, సర్టిఫికెట్లు, వైద్యం,వ్యవసాయ సాయం ఇలా అన్నీ ఇతని ద్వారానే జరగాలి.కానీ నెల నెలా ప్రభుత్వం నుండి వేల్లో జీతం తీసుకుంటూ, అదే సమయాన్ని ప్రైవేట్ కాలేజీలో ఉపయోగించుకుని అదనపు ఆదాయం సంపాదించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇది కేవలం ఒకరోజు వ్యవహారం కాదని, చాలా కాలంగా ఇదే తంతు కొనసాగుతోందని స్థానికుల ఆరోపణ.దీనివల్ల చింతల్ చెరువు పరిధిలోని వందలాది కుటుంబాలు ప్రభుత్వ సేవలకు దూరమవుతున్నాయి.
విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి: ప్రజల డిమాండ్
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగ నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రైవేట్ వ్యాపారం గానీ,బోధన గానీ చేయడానికి వీల్లేదు.అలా చేస్తే అది నేరుగా సర్వీస్ రూల్స్ ఉల్లంఘన కిందికి వస్తుంది.కావున సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి,స్థానికులు అందుబాటులో ఉంచిన వీడియోలు,ఫొటోలు మరియు ఇతర ఆధారాలతో సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఆరోపణలు నిజమని తేలితే సస్పెన్షన్ తో పాటు డిస్మిస్ వరకు కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని,అప్పటివరకు తీసుకున్న జీతాన్ని రికవరీ చేయాలని వారు కోరుతున్నారు.లేనిపక్షంలో సచివాలయ వ్యవస్థపైనే ప్రజలకు నమ్మకం పోతుందని హెచ్చరిస్తున్నారు.ఈ విషయంపై సంబంధిత ఎంపీడీవో,ఆర్డీవో,స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని బద్వేల్ ప్రజలు కోరుతున్నారు.