
వైఎస్సార్ కడప జిల్లా(జూన్ 06) ప్రజావాణి కమలాపురం మండలం టి.చదివిరాళ్ల గ్రామ సచివాలయంలో అధికారుల నిర్లక్ష్యం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.గ్రామ ప్రజలు అవసరమైన పనుల కోసం ఉదయం 11 గంటలకు వెళ్లినా, సాయంత్రం 4 గంటలకు వెళ్లినా సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితి నెలకొంది.అధికారులు లేకపోయినా సచివాలయం తలుపులు తెరిచి ఉండటం,ఫ్యాన్లు యథావిధిగా తిరుగుతుండటం, లోపల ఎవరూ లేకపోయినా విలువైన వస్తువులు అలాగే వదిలి వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ప్రజలకు సేవలు అందించాల్సిన సచివాలయంలో అధికారులు ఎప్పుడు వస్తున్నారు,ఎప్పుడు వెళ్తున్నారు అన్నది తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయంలో సిబ్బంది గైర్హాజరు కావడం, కార్యాలయ భద్రతను సైతం పట్టించుకోకపోవడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సచివాలయం తెరిచి ఉంచిన వెనుక ఆంతర్యం ఏమిటి అధికారులు విధుల్లో ఉన్నారా.లేక ప్రజలను పట్టించుకోవడం లేదా.అనే ప్రశ్నలు గ్రామ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.జిల్లా ఉన్నతాధికారులు స్పందించి టి.చదివిరాళ్ల గ్రామ సచివాలయంలో నెలకొన్న పరిస్థితులపై విచారణ జరిపి, ప్రజలకు అందుబాటులో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.