వ్యవసాయ బావిలో పడిన మొసలి సురక్షితంగా వెలికితీత

చెన్నారావుపేట జూలై 22 ప్రజావాణి
చెన్నారావుపేట మండలం అక్కల్ చెడ గ్రామంలోని ముగ్ధుంపురం చెరువును ఆనుకొని ఉన్న ఒక వ్యవసాయ బావిలో రెండు రోజుల క్రితం పడిన మొసలిని బుధవారం అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. సర్పంచ్ భూక్య బుజ్జి సురేష్, గ్రామస్తుల సమక్షంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బీట్ ఆఫీసర్ నవీన్ ఆధ్వర్యంలో వరంగల్ రెస్క్యూ టీం, బేస్ క్యాంప్ సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. స్వామి, శంకర్, కొమురయ్య, కృష్ణ, సాంబరాజు, చందూలాల్, రవి, శివ, మహేష్ తదితరులు శ్రమించి మొసలిని బావిలో నుండి వెలికి తీశారు. బయటకు తీసిన మొసలిని చూడటానికి స్థానిక యువకులు, మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వెలికితీసిన మొసలిని వరంగల్ జూ పార్కుకు తరలిస్తున్నట్లు బీట్ ఆఫీసర్ నవీన్ వెల్లడించారు. భయాందోళనకు గురైన గ్రామస్తులు మొసలిని సురక్షితంగా పట్టుకోవడంతో ఉపశమనం పొందారు.