Date of Publish : 16 March 2026, 2:21 pmDigital Edition : VENU THIRUMALAYAPALEM
వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం..
తిరుమలాయపాలెం,ప్రజావాణి:
తిరుమలాయపాలెం మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.మండలంలోని గ్రామపంచాయతీలకు చెందిన వార్డు సభ్యులకు మూడు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి విడతగా మండల పరిధిలోని 15 గ్రామపంచాయతీల వార్డు సభ్యులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ వ్యవస్థలో వార్డు సభ్యుల బాధ్యతలు, విధివిధానాలు, గ్రామసభ నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై వారికి అవగాహన కల్పించారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలంటే వార్డు సభ్యులు ప్రజలతో మమేకమై వారి సమస్యలను గుర్తించి పంచాయతీ దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు.గ్రామస్థాయిలో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. గ్రామసభ సమావేశాల్లో వార్డు సభ్యులు తప్పనిసరిగా పాల్గొని ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించేలా పని చేయాలని సూచించారు.ఈ సందర్భంగా ఎంపీవో ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామపంచాయతీ వ్యవస్థలో వార్డు సభ్యులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ప్రజల సమస్యలను గ్రామసభల ద్వారా గుర్తించి వాటికి పరిష్కార మార్గాలు చూపడం వార్డు సభ్యుల ముఖ్య బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా వార్డు సభ్యులు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, సంబంధిత సిబ్బంది, వార్డు సభ్యులు పాల్గొన్నారు.