prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 10:59 am Digital Edition : RAJASHEKARREDDY

వర్షాభావంతో విలవిల్లాడుతున్న పత్తి పంట- “స్ప్రింక్లర్లతో పంటను కాపాడుకుంటున్న రైతన్నలు”.. వర్షాల కోసం ఎదురు చూస్తున్న అన్నదాత

బెజ్జంకి, జూలై 13 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని నర్సింహులపల్లి గ్రామంలో తొలి వర్షాలకు మొలకెత్తిన పత్తి పంట ప్రస్తుతం వర్షాభావంతో ఎండిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంట ఎండిపోకుండా కాపాడేందుకు రైతులు బోర్ల నీటిని స్ప్రింక్లర్ల ద్వారా అందిస్తూ మొక్కలను సంరక్షించే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే సాగు కోసం భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు, వర్షాభావం కారణంగా అదనంగా నీటి కోసం ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు త్వరలో వర్షాలు కురవకపోతే పత్తి దిగుబడి తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే గ్రామాలను సందర్శించి పరిస్థితిని అంచనా వేసి రైతులకు అవసరమైన సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం నర్సింహులపల్లి రైతుల ఆశలన్నీ రానున్న వర్షాలపైనే నిలిచాయి.