
విజయవాడ జూన్ 5 ప్రజావాణి నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిల్వ ఉండటంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ముఖ్యంగా నిర్మల స్కూల్ జంక్షన్, బెంజ్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, పీవీపీ మాల్ పరిసరాలు, ఫోర్డ్ కటింగ్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు మందగించాయి.ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర్ బాబు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ శ్రీమతి షేక్ షరీనా బేగం, ఐపీఎస్ పర్యవేక్షణలో ట్రాఫిక్ పోలీసులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు.వాహనదారులు వర్ష సమయంలో వేగ నియంత్రణ పాటించాలని, ముందున్న వాహనాలకు తగినంత దూరం ఉంచాలని, ఆకస్మిక బ్రేకులు వేయకుండా జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక అప్రమత్తతతో వ్యవహరించాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలని కోరారు.ప్రజలు సహకరించి ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా రహదారి భద్రతకు తోడ్పడాలని ట్రాఫిక్ శాఖ విజ్ఞప్తి చేసింది.