ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
గోదావరి తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం.
పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి.
:: రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క.
ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)
వరద ముప్పుపై ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, గోదావరి తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నామని, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
శనివారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పోతో కలిసి మంగపేటలో గోదావరి వరద ప్రవాహాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు.
అనంతరం వరద ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మంగపేట గోదావరి కరకట్ట నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, బ్యాక్వాటర్ ప్రభావంతో ముంపునకు గురయ్యే ప్రాంతాలకు చెందిన 28 కుటుంబాల 112 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నందని, నది పరివాహక ప్రాంతాల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్య సౌకర్యాలు సహా అన్ని మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధితులను పరామర్శించిన మంత్రి, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఏ ఎస్ పి మనన్ భట్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి,ఆర్డీవో కృష్ణవేణి, డి పి ఓ వెంకయ్య, తహసిల్దార్ తోట రవీందర్, ఎం పి డి ఓ బద్రూ, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బై రిపోర్టర్ గొల్లపెల్లి శ్రీకాంత్