కడపజిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్14)దేశంలో బిజెపి ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టే విధానాలకు వ్యతిరేకంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం విస్తృతంగా ప్రజానీకాన్ని కలుపుకొని ఉద్యమించాల్సిన అవసరం ఉందని సిపిఎం పార్టీ కడప నగర కార్యదర్శి రామమోహన్ పిలుపునిచ్చారు.మంగళవారం నాడు కడప నగరంలోని మృత్యుంజయకుంటలో ఉన్న సిపిఎం పార్టీ ఆఫీసులో పార్టీ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా రామమోహన్ మాట్లాడుతూ కుల అస్తిత్వం ఉన్నంతకాలం కుల నిర్మూలన సాధ్యం కాదని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పారన్నారు.కుల వ్యవస్థను హిందూ మతం పెంచి పోషిస్తున్నదని,తాను హిందువుగా జన్మించినా హిందువుగా మాత్రం చనిపోవాలని లేదని జీవిత చరమాంకంలో బౌద్ధాన్ని స్వీకరించారన్నారు.మతం కులానికి పునాది కాదని,అది ఈ వ్యవస్థతో పెనవేసుకుందని,దానికి వ్యతిరేకంగా సాగే వర్గ పోరాటాల్లో అంతర్భాగంగా కుల వివక్షపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.మతం పేరుతో దళితుల్ని విడగొట్టడం అంబేద్కర్ కు అపచారమేనని ఆయన తెలిపారు. దేశంలో బిజెపి ప్రభుత్వం కుల పునాదులు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. క్రైస్తవంలోకి మారిన దళితులు ఎస్సీలు కాదని జరుగుతున్న ప్రచారంలో హేతుబద్ధత లేదన్నారు.రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవులు అలంకరించిన వారు పరోక్షంగానైనా కుల వివక్షతను సమర్థించడం నేరమవుతుందన్నారు.అసమానతలు లేని సమాజాన్ని సాధించుకుంటేనే సామాజిక న్యాయం సాధించుకోగలమని అంబేద్కర్ ఆశించినట్టుగా కుల నిర్మూలన జరిగేందుకు సమిష్టిగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు దస్తగిరిరెడ్డి,వెంకటేశ్వర్లు,రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి,నరసింహ,బాలకృష్ణ, రవికుమార్,సుదర్శన్,రాఘవ,దుర్గ,రవి,సుమంత్,ఉదయ్, బాల, శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.