రేకొండ గ్రామ పంచాయతీలో అక్రమాలపై జిల్లా కలెక్టర్కు వినతి
కరీంనగర్, జూలై 13 (మన ప్రజావాణి): చిగురుమామిడి మండలం రేకొండ గ్రామ పంచాయతీలో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న అక్రమాలు, నిధుల దుర్వినియోగం, పారదర్శకత లోపం, గ్రామసభల నిర్వహణలో నిర్లక్ష్యం తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ రేకొండ గ్రామ ప్రజలు సోమవారం జిల్లా కలెక్టర్కు ప్రజావాణి కార్యక్రమంలో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో గ్రామసభలను చట్టప్రకారం నిర్వహించడం లేదని, గ్రామసభ తీర్మానాలు ప్రజలకు వెల్లడించడం లేదని, పంచాయతీ ఆదాయం–వ్యయ వివరాలు, జేసీబీ పనులు, ట్రాక్టర్ వినియోగం, చెట్ల నరికివేత, పన్నుల వసూళ్లు, బ్యాంకు లావాదేవీలు, విద్యుత్ బిల్లులు, అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు, వౌచర్లు, ప్రభుత్వ నిధుల వినియోగంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరారు.
అలాగే గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల నాణ్యతను పరిశీలించి, అన్ని రికార్డులను స్వాధీనం చేసుకుని ప్రత్యేక విచారణ నిర్వహించాలని, అక్రమాలు రుజువైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను విజ్ఞప్తి చేశారు.
“ప్రజల సొమ్ముతో నడిచే గ్రామ పంచాయతీలో ప్రతి రూపాయి ఖర్చుకు లెక్క ఉండాలి. ప్రజలకు సమాచారం ఇవ్వకుండా పాలన సాగించడం సరైంది కాదు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి” అని ఫిర్యాదుదారులు కోరారు.