ఎన్టీఆర్ జిల్లా ఏప్రిల్8(ప్రజావాణిన్యూస్) రూ.70 లక్షలు ఖర్చు చేసి అప్పుల్లో మునిగిన టీడీపీ కార్యకర్త,ఎమ్మెల్యే నిర్లక్ష్యంపై బడే మదన్ ఆవేదన అధికారుల నిర్లక్ష్యం కార్యకర్త జీవితాన్ని నాశనం చేసిన నీరు చెట్టు పనులు.ఎన్టీఆర్ జిల్లా షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన బడే మదన్ అనే వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది.దాదాపు 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ,పార్టీ కోసం తన జీవితాన్ని అర్పించిన ఈ కార్యకర్తను ఇప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.2016 నుండి 2018 వరకు ‘నీరు చెట్టు’ పథకం కింద గ్రామంలోని చెరువు అభివృద్ధి పనులను స్వయంగా చేపట్టి, సుమారు 150 ఎకరాల పరిధిలో పనులు పూర్తి చేయడానికి ఆయన తన సొంత డబ్బులతోనే దాదాపు రూ.70 లక్షలు ఖర్చు పెట్టారు.ప్రభుత్వంపై, నాయకులపై నమ్మకంతో ముందుకు వచ్చిన ఆయనకు ఇప్పుడు ఆ నమ్మకం మోసం చేసినట్టుగా మారింది.పనులు పూర్తయ్యాక కూడా ఒక్క రూపాయి చెల్లింపు లేకపోవడం, పైగా అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఆయన తీవ్ర అప్పుల్లో కూరుకుపోయారు.కుటుంబ పరిస్థితి దారుణంగా మారిందని, జీవనోపాధి సంక్షోభంలో పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇంత పెద్ద నష్టం జరిగినప్పటికీ, స్థానిక ఎమ్మెల్యేను పలుమార్లు కలిసినా ఎలాంటి స్పందన లేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.పార్టీ కోసం నా జీవితాన్ని అర్పించాను గ్రామ అభివృద్ధి కోసం నా డబ్బు ఖర్చు పెట్టాను. కానీ ఇప్పుడు నన్ను ఎవరూ గుర్తించట్లేదు. ఇది న్యాయమా ? అంటూ మదన్ ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వ పథకాలు అమలు పేరుతో కార్యకర్తలను ఉపయోగించుకుని, తరువాత వదిలేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, బడే మదన్కు న్యాయం చేయకపోతే పెద్ద స్థాయిలో ఆందోళనలు చెలరేగే అవకాశాలు ఉన్నాయని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.