prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 10:37 am Digital Edition : PRAJA VANI

రుద్రమూర్తికి విశేష పూజలు

*రుద్రమూర్తికి విశేష పూజలు*
నంద్యాల జిల్లా శ్రీశైలం ఏప్రిల్ 21 (ప్రజావాణి)
లోకకల్యాణం కోసం ఆలయ ఈశాన్య భాగంలో గల రుద్రవనములోని  (రుద్రపార్కులోని) రుద్రమూర్తికి  ఈ రోజు (21.04.2026) శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపించబడ్డాయి.
ఈ రుద్రమూర్తి విగ్రహాన్ని గతంలో వైశాఖ మాసములో నెలకొల్పడం జరిగింది.
కాగా ఈ రోజు ఉదయం జరిగిన పూజాదికాలలో ముందుగా లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. ఈ సంకల్పంలో దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రకృతి వైపరీత్యాలు నివారించబడాలని, దేశంలో సుఖశాంతులు విలసిల్లాలని, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని, జనులందరికీ సుఖసంతోషాలు కలగాలని పేర్కొనబడింది.
తరువాత రుద్రమూర్తికి  అభిషేకం నిర్వహించబడింది. అర్చకులు రుద్రమంత్రాలను పఠిస్తుండగా శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ, గందోధకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, సుగంధోదకాలతోనూ, ఆ తరువాత జలంతోనూ ఈ అభిషేకం నిర్వర్తించబడింది.
అనంతరం రుద్రదేవునికి బిల్వార్చనతో పాటు పుష్పార్చన కూడా జరిపించబడింది
ఈ పుష్పార్చనలో వివిధ రకాల పుష్పాలు వినియోగించబడ్డాయి.
రుద్రదేవుని చల్లని చూపులు ఎల్లప్పుడు కృష్ణానదిపై ప్రసరించడం వలన కృష్ణానదిలో నీరు సమృద్ధిగా ఉండి, పంటలు బాగా పండుతాయని, అదే విధంగా శ్రీశైలం ఆనకట్ట ఎల్లప్పుడూ పరిరక్షించబడుతూ ఉంటుందని పలువురు ఆధ్యాత్మికవేత్తలు సూచించడంతో ఆలయ ఈశాన్యభాగంలో కృష్ణానదికి అభిముఖంగా (రుద్రుని దృష్టి కృష్ణానదిపై పడే విధంగా) ఈ రుద్రుని విగ్రహాన్ని దేవస్థానం నెలకొల్పింది.
ఈ కార్యక్రమములో సహాయ కార్యనిర్వహణాధికారి యం. హరిదాసు, అర్చకులు, సంబంధిత  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.