prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 7:18 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

రాష్ట్ర స్థాయి మాక్ పార్లమెంట్ పోటీలకు విద్యార్థిని జావళి ఎంపిక

రాష్ట్ర స్థాయి మాక్ పార్లమెంట్ పోటీలకు బీర్పూర్ విద్యార్థిని ఎంపిక

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ధర్మపురి మార్చి 18 (ప్రజావాణి):

జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి మాక్ పార్లమెంట్ పోటీల్లో బీర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని జావళి అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయింది. వివిధ పాఠశాలల నుంచి తరలివచ్చిన విద్యార్థుల మధ్య సాగిన ఈ హోరాహోరీ పోటీల్లో జావళి తన వాగ్ధాటితో అందరినీ అబ్బురపరిచారు. క్యూబా ప్రతినిధిగా మెరిసిన జావళి, ఈ పోటీల్లో జావళి ఒక బాధ్యతాయుతమైన క్యూబా దేశ ప్రజాప్రతినిధిగా వ్యవహరించారు. ప్రస్తుత సామాజిక అంశాలు, అంతర్జాతీయ నిబంధనలపై ఆమెకు ఉన్న అవగాహన, తర్కబద్ధమైన వాదనలు నిర్ణేతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. సభలో ఒక అనుభవజ్ఞురాలైన నాయకురాలిలా తన గళాన్ని వినిపించి అందరి ప్రశంసలు అందుకున్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికవడంపై జావళి ఆనందం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర స్థాయిలోనూ సత్తా చాటి జిల్లా పేరు నిలబెడతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి జావళిని ప్రత్యేకంగా అభినందించారు. ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ వేడుక చేసుకున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా జావళి విజయం సాధించాలని ఆకాంక్షించారు.