prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 2:13 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

రాబోయే 7 రోజుల పాటు వడగాలుల తీవ్రత – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

మంగళగిరి (మే 20 ప్రజావాణి) -తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో మధ్యాహ్న వేళల్లో అవసరమైన మేరకు మాత్రమె బయటకు రావలెను.వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు పాటించండి–మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కమీషనర్ అలీమ్ బాషా.రాబోయే 7 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు మరియు వడగాలులు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్.అలీం బాషా తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం మరియు విపత్తు నిర్వహణ శాఖ విడుదల చేసిన హెచ్చరికల మేరకు ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ నీరసం,డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తే అవకాశమున్నందున ముఖ్యంగా చిన్నపిల్లలు,వృద్ధులు గర్భిణీలు,అనారోగ్య సమస్యలు ఉన్న వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయటకు రావద్దని తెలిపారు.ఎండలో విధులు నిర్వహించే కార్మికులు,రోడ్లపై వ్యాపారం చేసే వారు,శానిటేషన్ సిబ్బంది మరియు నిర్మాణ కార్మికులు తలకు టోపీ లేదా గుడ్డ కట్టుకోవడం,తరచూ నీరు తాగడం,మజ్జిగ,ఓఆర్‌ఎస్ ద్రావణం,కొబ్బరి నీరు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం తప్పనిసరి అని సూచించారు.పిల్లలను ఎండలో ఆడనివ్వకూడదని,వాహనాల్లో చిన్నపిల్లలను ఒంటరిగా వదిలివేయరాదని హెచ్చరించారు.అలాగే ప్రజలు తేలికపాటి కాటన్ దుస్తులు ధరించడం,బయటకు వెళ్లేటప్పుడు గొడుగు ఉపయోగించడం మంచిదని తెలిపారు.వడదెబ్బ లక్షణాలైన అధిక జ్వరం,తలనొప్పి,వాంతులు,అధిక అలసట చెమటలు ఆగిపోవడం,స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కమిషనర్ సూచించారు. అదేవిధంగా ఎవరైనా వడదెబ్బకు గురైనట్లు అనిపించినా లేదా ఆరోగ్య సమస్యలు ఎదురైనా సమీప అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను సంప్రదించవలసింది గా ఆయన తెలిపారు.నగర పాలక సంస్థ పరిధి లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని,ప్రజలు వినియోగించుకోవాలని ఈ విషయమై శానిటేషన్ మరియు ఆరోగ్య విభాగ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కమీషనర్ కోరారు.