prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 2:08 pm Digital Edition : PRAJA VANI

యు.ఎస్.పి.సి నాలుగు దశల ఉద్యమాలను విజయవంతం చేద్దాం

విద్యారంగ, పాఠశాల, విద్యార్థి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

కల్లూరు, ఆగస్టు 7 (మన ప్రజావాణి):
విద్యారంగం, పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం యు.ఎస్.పి.సి ఆధ్వర్యంలో చేపడుతున్న నాలుగు దశల ఉద్యమ కార్యక్రమాలను ఉపాధ్యాయులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టి.పి.టి.ఎఫ్. కల్లూరు మండల ప్రధాన కార్యదర్శి పొట్టపింజర రాము పిలుపునిచ్చారు.

ఉద్యమంలో భాగంగా గురువారం ఎం.పి.యు.పి.ఎస్. పెద్దకోరుకొండ పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి తమ సమస్యలను పరిష్కరించాలని నినదించారు.

నాలుగు దశల్లో ఉద్యమం

ఆగస్టు 7: పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి నిరసన తెలపడం.

ఆగస్టు 12, 13: మండల కేంద్రాల్లో అధికారులకు మెమోరాండాలు సమర్పించడం.

ఆగస్టు 21 నుంచి 26 వరకు: రాష్ట్ర, జిల్లా నాయకుల పర్యటనలు నిర్వహించడం.

ఆగస్టు 29: హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించడం.

అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్‌లో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని నాయకులు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని పొట్టపింజర రాము అన్నారు.

ఈ కార్యక్రమంలో మురళీ, వెంకట రమణ, సుందర్, సక్రం, అనూష తదితరులు పాల్గొన్నారు.